రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర పరిధిలోని అంశమేనని తేల్చేసింది. కేంద్రం నుంచి క్యాపిటల్ పై క్లారిటీ రావడంతో ఇక సెలెక్ట్ కమిటీ వ్యవహారంపై వైసీపీ దృష్టి సారించింది. ఎలాగైనా కమిటీ ఏర్పాటయ్యేలా విపక్షాలు ప్రయత్నాల్లో ఉంటే.. కౌన్సిల్ రద్దు కోసం హస్తినలో లాబీయింగ్ చేస్తూనే.. సెలక్ట్ కమిటీ వ్యూహానికి చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు సీఎం జగన్. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. గతంలో ఇచ్చిన జీవో ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతి ఉందన్నారు. ఇటీవల మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించినట్టు మీడియా నివేదికలొచ్చాయన్నారు. అయితే రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర పరిధిలోని అంశమన్నారు.
ఇన్నాళ్లుగా తాము చెప్పిందే ఇప్పుడు కేంద్రం కూడా చెప్పిందన్నారు మంత్రి బొత్స. అమరావతి గురించి గొప్పగా చెప్పుకుంటున్న టీడీపీ… రాజధానికి నోటిఫికేషనే ఇవ్వలేదన్నారు బొత్స. అటు సెలెక్ట్ కమిటీపై విపక్షాలు సభ్యులను ప్రతిపాదిస్తూ లేఖలు ఇచ్చినా.. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు సీఎం జగన్ సమావేశమయ్యారు. మరోవైపు మండలి ఛైర్మన్కు విచక్షణా అధికారాలు ఉంటే… ప్రభుత్వానికి కూడా ఉంటాయని కామెంట్ చేశారు మంత్రి బొత్స. మండలిలో అడ్డగోలుగా వ్యవహారం నడిచిందని, అలాగే వెళ్లడానికి సిద్ధంగా ప్రభుత్వం లేదని తేల్చి చెప్పారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు రూల్స్కు విరుద్ధంగా జరిగిన ప్రక్రియలో సెలెక్ట్ కమిటీనే ఏర్పాటు కాలేదని, లేని కమిటీకి పేర్లు ఇవ్వడం, తమను కూడా ఇవ్వాలనడం హాస్యాస్పదమంటున్నారు సజ్జల.