ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకూ ‘ఆధార్’ తరహాలో ప్రత్యేక ఓ సంఖ్యను కేటాయించాలని నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’ పేరుతో ప్రత్యేక సంఖ్య ఇవ్వనుంది. దీనికోసం రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల సర్వే చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఇందు కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తోంది.
దేశంలోనే తొలిసారి ఇలాంటి కొత్త ప్రయోగానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో ప్రభుత్వం వద్ద పరిశ్రమలకు చెందిన పూర్తి సమాచారం ఆన్ లైన్ లో ఉండిపోతుంది. ‘పరిశ్రమ ఆధార్’ కలిగి ఉన్న ఇండస్ట్రీలోని ఉద్యోగుల సమాచారంతోపాటు అందులో ప్రతి విషయం ఇందులో పొందుర్చుతారు.
ఆ పరిశ్రమ నిర్వహించేర ఎగుమతులు దిగుమతుల వివరాలను ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేయించుకోవల్సి ఉంటుంది. వారికి ఉన్న మార్కెటింగ్ వివరాలను కూడా పరిశ్రమ యాజమాన్యం అందించాల్సి ఉంటుంది. ‘పరిశ్రమ ఆధార్’ తో ఆ పరిశ్రమ జరుపుతున్న బిజినెస్ మొత్తం ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల పారదర్శకత ఏర్పాడే ఛాన్స్ ఉంది.
‘పరిశ్రమ ఆధార్’ కోసం పరిశ్రమల్లోని కార్మికులు, విద్యుత్, భూమి, నీటి లభ్యత గురించి తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎగుమతి-దిగుమతి, ముడిసరకు లభ్యత, మార్కెటింగ్ సహా మొత్తం 9 అంశాల్లో వివరాలను పరిశ్రమల శాఖ సేకరించనుంది. మొబైల్ యాప్తో గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ఈ సర్వే చేపట్టనున్నారు. సమగ్ర పరిశ్రమ సర్వేకు జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమలశాఖ డైరెక్టర్ నేతృత్వంలో కమిటీలు త్వరలోనే ఏర్పాటు కానున్నాయి. అక్టోబర్ 15 నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.