రైతులు తమ పంటలను నేరుగా అమ్ముకునే విధంగా జనతా బజార్లు అందుబాటులోకి రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రైతు భరోసా కేంద్రాల పక్కన దాదాపు రూ.6 వేల కోట్లతో మల్టిపర్పస్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల దగ్గర మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి ఇవాళ అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఈ మార్కెటింగ్ మల్టిపర్పస్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలన్నీ కూడా ఆప్కాబ్ ద్వారా నాబార్డ్కు పంపించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెటీరియల్, సీడ్స్, ఫర్టిలైజర్స్ అన్ని నాణ్యతగా ఉండాలన్నారు. రైతు భరోసా కేంద్రాల దగ్గర మొత్తం 13 రకాల సదుపాయాల కల్పనకు మార్గనిర్దేశం చేశారు. గోదాములు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్, కలెక్షన్ సెంటర్స్, కోల్డ్ రూమ్లు, స్టోరేజిలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, అసేయింగ్ ఎక్విప్మెంట్, జనతా బజార్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, సెలక్టెడ్ గ్రామాల్లో ఆక్వా ఇన్ఫ్రా.. ఇంకా కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో క్యాటిల్ షెడ్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి.