14 ఏళ్లుగా ఆహారానికి దూరం.. మిక్చర్, టీతోనే కడుపు నింపుకుంటున్న బాలిక
ఓ బాలిక ఏకంగా 14 ఏళ్లుగా అన్నం తినడం మానేసింది. కేవలం చిరు తిళ్లు మాత్రమే తిని కాలం వెల్లదీస్తుంది. భోజనం చేయకపోయిన మిక్చర్, టీ తాగుతూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.
మాములుగా ఒక్క పూట భోజనం చేయకుంటేనే అల్లాడిపోతాం.. పండగలకు ఉపవాసముంటేనే ఆకలితో అలమటించిపోతాం.. అలాంటిది ఓ బాలిక ఏకంగా 14 ఏళ్లుగా అన్నం తినడం మానేసింది. కేవలం చిరు తిళ్లు మాత్రమే తిని కాలం వెల్లదీస్తుంది. భోజనం చేయకపోయిన మిక్చర్, టీ తాగుతూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలానికి చెందిన బెండాలపాడు గ్రామానికి చెందిన పొడియం రాధాకృష్ణ, అరుణ దంపతులకు కుమార్తె నాగేంద్ర(15), కుమారుడు రాజు ఇద్దరే సంతానం. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న నాగేంద్ర ఏడాది వయసు నుంచే అన్నం తినడం మానేసింది. రోజులో మూడుసార్లు చిరుతిండితోనే కడుపు నింపుకొంటోంది. కుటుంబ సభ్యులందరం అన్నం తింటున్నా, కుమార్తె మాత్రం మిక్చర్, టీ ఆహారంగా తీసుకుంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. బడికి వెళ్తున్నా, పొలం పనులకు పోతున్నా క్యారియర్లో మిక్చర్, తిను బండారాలు తీసుకువెళ్తుందని చెప్పారు. అన్నం అలవాటు చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన లాభ లేకపోయిందని, అవే తింటూ ఆరోగ్యం ఉంటుందని తండ్రి వెల్లడించారు. అన్నం తిన్నడం వల్ల వాంతులు చేసుకుంటుండటంతో చివరికి మిక్చరే పెడుతూ వస్తున్నామని’ ఆయన తెలిపారు.