లాక్డౌన్: నడి రోడ్డుపైనే ప్రసవించిన మహిళ
సూర్యాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న రేష్మ అనే మహిళకు అర్థరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో నొప్పులు రావడంతో భర్త వెంకన్న 108కి ఫోన్ చేశారు. అయినా వైద్య సిబ్బంది స్పందించలేదు. మళ్లీ ఫోన్ చేస్తే గంట తర్వాత..
లాక్డౌన్ ఎఫెక్ట్ అందరికీ ఒకేలా ఉండదు. ముఖ్యంగా లాక్డౌన్ ప్రభావం వల్ల గర్భిణిలు పలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. సూర్యాపేటకు చెందిన ఓ గర్భిణి నడి రోడ్డుపైనే ప్రసవించింది. అర్థరాత్రి పురిటి నొప్పులు రావడంతో.. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న రేష్మ అనే మహిళకు అర్థరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో నొప్పులు రావడంతో భర్త వెంకన్న 108కి ఫోన్ చేశారు. వెంకన్న ఫోన్కు వైద్య సిబ్బంది సరిగా స్పందించలేదు. మళ్లీ ఫోన్ చేస్తే.. గంట తర్వాత వస్తామని చెప్పి.. ఫోన్ పెట్టేశారు. దీంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి సహాయం కావాలని బతిమలాడాడు. వాహనాలున్నా… డ్రైవర్లు లేరని చెప్పడంతో.. భార్యను తీసుకొని రోడ్డుపై వెళ్తుండగానే ఆమె ప్రసవించింది.
ఈ లోపలే స్థానికులు ఆటో తీసుకురావడంతో వెంకన్న సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డ్యూటీలో సిబ్బంది ఉన్నా.. తాము రాలేమని తేల్చి చప్పారు. ఈ లోగా కోదాడ రూరల్ సీఐ శివరాం రెడ్డి వెంటనే జనరల్ ఆస్పత్రికి వచ్చి ఆంబులెన్స్ కోసం ప్రయత్నించారు. వారు సీఐకి కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. అంతేగాక 108కి ఫోన్ చేయాలని సలహా ఇచ్చారు. అయితే కొద్దిసేపటికే 108 ఆంబులెన్స్ రావడంతో తల్లీ బిడ్డలనూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read More:
రికార్డు సృష్టించిన బంగారం.. రూ. 47 వేలకు చేరువ
పిజ్జా డెలివరీ బాయ్కి కరోనా పాజిటివ్