
ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మైన్పురి జిల్లాలో ఒక మహిళ ఏటీఎంలో మామూలుగా బ్యాలెన్స్ చెక్ చేసుకుంది. అయితే తన బ్యాంకు ఖాతాలోకి దాదాపు రూ. 10 కోట్లు జమ అయినట్లు గుర్తించి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన గందరగోళానికి దారితీసింది. బ్యాంకింగ్ వ్యవస్థలపై ప్రశ్నలను లేవనెత్తింది. వెంటనే అప్రమత్తమైన ఆ మహిళ బ్యాంకుకు పరుగులు తీసింది.
ఆ మహిళకు బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఖాతా ఉంది. ఆమె అకౌంట్లో రూ. 9,99,49,586 మొత్తం అనుకోకుండా కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. తాను పిన్ జనరేట్ చేయడానికి, బ్యాలెన్స్ చూసుకోవడానికి ఏటీఎంకు వెళ్లినప్పుడు స్క్రీన్పై అసాధారణంగా పెద్ద మొత్తం కనిపించిందని ఆమె కుమారుడు అరుణ్ కుమార్ చెప్పాడు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ లావాదేవీ గురించి తనకు ఏమీ తెలియదని ఆ మహిళ చెప్పింది. “ఈ డబ్బు ఎలా వచ్చిందో తెలియదు. ఇది ఎవరిదైనా సరే, దాన్ని తిరిగి ఇచ్చేయాలి,” అని అనుకుంటున్నట్లు తెలిపింది. ఆమె భర్త అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబానికి ఆ నిధులపై ఎలాంటి హక్కు లేదని అన్నారు.
ఈ వార్త వైరల్ కావడంతో బ్యాంకు అధికారులు స్పందించారు. దానిని సాంకేతిక లోపంగా పేర్కొన్నారు. ఏటీఎం బ్యాలెన్స్ చెక్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా సుల్తాన్గంజ్ శాఖ అధికారులు ఈ సంఘటనకు సాంకేతిక లోపమే కారణమని పేర్కొన్నారు. ఆ మహిళకు అప్పటికే రుణ ఖాతా ఉందని, ఆమె బ్యాంకును ముందుగానే సంప్రదించి ఉంటే ఈ సమస్య పరిష్కారమయ్యేదని బ్రాంచ్ మేనేజర్ తెలిపారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..