
ప్రకృతి సృష్టిలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. చేపలను చూసి మానవుడు ఈత నేర్చుకున్నాడు, పక్షులను చూసి విమానాన్ని కనిపెట్టాడు. కానీ నీటిపై మునిగిపోకుండా పరిగెత్తడం మాత్రం మనిషికి ఇప్పటికీ అందని ద్రాక్షే. అయితే ఈ ప్రపంచంలో ఒక జీవికి మాత్రం నీటిపై నడిచే అద్భుత శక్తిని ప్రకృతి ప్రసాదించింది. అదే బాసిలిస్క్ బల్లి. బైబిల్ కథల ప్రకారం.. జీసస్ క్రైస్ట్ నీటిపై నడిచారని చెబుతారు. సరిగ్గా అదే విధంగా ఈ బల్లి కూడా నీటిపై మునిగిపోకుండా పరిగెత్తగలదు కాబట్టి దీనికి జీసస్ క్రైస్ట్ బల్లి అని పేరు వచ్చింది. ఇది సాధారణంగా వేటగాళ్ల నుండి తప్పించుకోవడానికి నీటిని రన్వేగా వాడుకుంటుంది.
ఈ బల్లికి నీటిపై నడిచే శక్తి రావడానికి దాని శరీర నిర్మాణం, వేగమే ప్రధాన కారణం. బాసిలిస్క్ బల్లి పాదాలకు వెడల్పుగా ఉండే కాలి వేళ్లు ఉంటాయి. ఇవి నీటిపై అడుగు వేసినప్పుడు గాలి పాకెట్లను సృష్టిస్తాయి.
అది తన పాదాలతో నీటిని బలంగా వెనక్కి నెడుతుంది. దీనివల్ల నీటిలో గాలి బుడగలు ఏర్పడతాయి. ఆ బుడగలు పగిలిపోయేలోపే తన పాదాన్ని బయటకు తీసి మరో అడుగు ముందుకు వేస్తుంది. ఈ బల్లి నీటిపై సెకనుకు దాదాపు 1.5 మీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. ఈ వేగం వల్ల గురుత్వాకర్షణ శక్తి దానిని కిందకు లాగలేకపోతుంది. పరిగెత్తే సమయంలో తన తోకను అటు ఇటు ఊపుతూ పడవకు చుక్కానిలా తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది.
ఒక మనిషి ఈ బల్లిలాగా నీటిపై మునిగిపోకుండా నడవాలంటే.. గంటకు కనీసం 108 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా మనుషులు పరిగెత్తే వేగం కంటే ఇది చాలా రెట్లు ఎక్కువ. అందుకే ఇది మనిషికి అసాధ్యం.. కానీ బాసిలిస్క్ బల్లికి వెన్నతో పెట్టిన విద్య..