
రాత్రి భోజనంలో అన్నం లేదా రోటీలలో ఏది తినాలనేది ప్రజలలో తరచుగా చర్చకు దారితీసే విషయం. కొన్ని ప్రాంతాల్లో రాత్రి అన్నం తింటే, మరికొన్ని చోట్ల రోటీని ఇష్టపడతారు. అయితే, మీ డిన్నర్ ప్లేట్లో ఏది ఉండాలి అనేది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుందని, ముఖ్యంగా మీరు తినే బియ్యం లేదా రోటీ రకాన్ని బట్టి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్నం, రోటీ రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కొంతమంది రోటీలో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయని భావిస్తారు, కాబట్టి ఆరోగ్యకరమైన ఎంపికగా చూస్తారు. ముంబైకి చెందిన డైటీషియన్ నజ్నిన్ హుస్సేన్ ఈ అంశంపై స్పందిస్తూ, ఫైబర్ అధికంగా ఉన్న రోటీని తింటే మంచిదని, కానీ పూర్తిగా శుద్ధి చేసిన పిండితో చేసిన రోటీ రక్తంలో చక్కెర స్థాయిని అన్నం వలెనే వేగంగా పెంచుతుందని వివరించారు. ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం కంటే పాలిష్ చేయని సన్న బియ్యం ఆరోగ్యానికి మంచిదని ఆమె పేర్కొన్నారు. ఫైబర్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని, బ్రౌన్ రైస్ లేదా పాలిష్ చేయని బియ్యం తినమని వైద్యులు, డైటీషియన్లు తరచుగా సిఫార్సు చేస్తారు.
అన్నంతో పాటు పప్పు, పెరుగు లేదా కూరగాయలను తినాలని కూడా సూచిస్తారు. బియ్యం గంజి లేదా పులావ్ కూడా ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. మన ఆహార అలవాట్లలో చేసే పొరపాటు ఏమిటంటే, ఎక్కువగా రోటీలు తిని, తక్కువ కూరగాయలు తీసుకోవడం. అన్నంతో పాటు కాయగూరలు ఎక్కువగా తింటే, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ మెరుగుపడుతుంది. అంటే దాని నుంచి ఉత్పత్తి అయ్యే చక్కెర శరీరంలో నెమ్మదిగా కరిగిపోతుంది. ఈ విధంగా, ఇది రోటీ కంటే మెరుగ్గా మారుతుందని దిల్లీలోని గంగారామ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎం. వలీ చెప్పారు. పిండితో మాత్రమే రోటీని చేస్తుంటే, దానికి ఆకుకూరలు లేదా కూరగాయలను కలపడం ద్వారా దాని పోషక విలువలను మెరుగుపరచవచ్చని ఆయన వివరించారు.
ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి అన్నం మంచిది. అయితే, అతిగా తినడం మానుకోవాలనుకుంటే లేదా తరచుగా తినకూడదనుకుంటే, ఎక్కువ ఫైబర్ ఉండే రోటీ మంచి ఎంపిక. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ప్రొటీన్ అధికంగా ఉండే రోటీ తీసుకోవడం ప్రయోజనకరమని ఎయిమ్స్ దిల్లీకి చెందిన డైటీషియన్ మాలా మన్రాల్ పేర్కొన్నారు. మాంసాహారులకు రోటీతో అనేక ఎంపికలు ఉన్నప్పటికీ, శాకాహారులకు కూరగాయలు లేదా పప్పుతో రోటీని తీసుకోవచ్చు. మనం ఏం తినాలనేది చేసే పని, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని మన్రాల్ వివరించారు. కూర్చొని ఉద్యోగం చేసేవారికి తక్కువ కేలరీలు అవసరం, కాబట్టి వారికి రోటీని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే వారు ఎక్కువ అన్నం తింటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి అన్నం తినాలా లేదా రోటీ తినాలా అనేది చాలావరకు వారి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. డయాబెటిస్ రోగులకు సాధారణంగా అన్నం తినకుండా పీచుపదార్థం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. రిఫ్రిజిరేటర్లో ఉంచిన అన్నం ఫైబర్ పరంగా మంచిదని పరిగణిస్తారు. అన్నం ఫ్రిజ్లో ఉంచినప్పుడు అందులోని పిండి పదార్థం ఫైబర్గా మారి, రక్తంలో చక్కెర స్థాయి అమాంతంగా పెరగకుండా సహాయపడుతుంది అని డైటీషియన్ తెలిపారు.
మన ప్రాంతీయ ఆహార అలవాట్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చిన్నప్పటి నుండి మనం తిన్నదే తేలికగా జీర్ణమవుతుందని, హాయిగా ఉంటుందని నమ్ముతారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉత్పత్తి అయ్యేదే ఆ ప్రాంత ప్రజల ప్రధాన ఆహారంగా మారుతుంది. ఉదాహరణకు, కశ్మీర్ ప్రజలకు వరి ప్రధాన ఆహారం కాబట్టి, వారికి అన్నం కంటే రోటీ మంచిదని చెప్పలేం. భారతదేశంలో చాలామంది అన్నం తింటారు. దక్షిణ భారతదేశంలో డయాబెటిస్ రోగులు కూడా అన్నం తింటారు, అయితే అది జీర్ణించుకోవడానికి క్లోమంపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండాలని దానికి అనేక పదార్థాలు జోడించి వండుతారు అని డాక్టర్ వివరించారు.