ఈ రోజుల్లో డయాబెటిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న వయసులోనే చాలా మందికి షుగర్ వస్తోంది. అసలీ సమస్యకు కారణం అసంపూర్ణమైన జీవన విధానం. సరైన సమయంలో భోజనం చేయకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినకుండా జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఒత్తిడి, నిద్రలేమి, ధూమపానం, మద్యపానం వంటి కారణాలతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అయితే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే దీన్ని నియంత్రించవచ్చు.
డయాబెటిస్ కంట్రోల్ చేయడంలో దాల్చిన చెక్క ఉపయోగకరమైనది. ఇది శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఒక గ్లాసు నీటిలో చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి మరగనిచ్చి ఆ నీటిని రోజూ తాగడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆహారంలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి చల్లుకోవచ్చు.
నేరేడు పండ్లు కూడా షుగర్ నియంత్రణలో సహాయపడతాయి. వీటి విత్తనాలను పొడిగా చేసుకొని రోజూ కొద్దిగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యం అవుతాయి. నేరేడు విత్తనాల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగినా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
మెంతులు డయాబెటిస్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. రాత్రి నీటిలో మెంతులు నానబెట్టి ఉదయాన్నే వాటిని తిని ఆ నీటిని తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కాకరకాయ రసం కూడా షుగర్ నియంత్రణకు మంచిది. రోజూ ఉదయం పరకడుపున 30 ఎంఎల్ కాకరకాయ రసం తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. కాకరకాయలోని ప్రత్యేకమైన రసాయనాలు ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరిచేలా చేస్తాయి.
పసుపులో ఉన్న కర్క్యూమిన్ అనే పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు కలిపి తాగడం లేదా పాలలో మిక్స్ చేసుకొని తాగడం ద్వారా డయాబెటిస్కి ఉపశమనం పొందవచ్చు.
తులసి ఆకులు కూడా ఈ సమస్యను నియంత్రించడంలో బాగా సహాయపడతాయి. రోజూ ఉదయం పరగడుపున 4-5 తులసి ఆకులు నమిలి తింటే లేదా తులసి రసం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధంగా ఉంటాయి.
ఈ విధంగా సరైన ఆహారం ఆరోగ్యకరమైన జీవన విధానం కొన్ని సహజసిద్ధమైన పద్ధతులను పాటిస్తే షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)