
టాలీవుడ్ కమెడియన్ చలాకీ చంటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, ఎదుర్కొన్న మానసిక సవాళ్లు, తోటి నటులతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చంటి తన కెరీర్లో ‘భీమిలి కబడ్డీ జట్టు’ మూవీలోని అమాయకమైన పాత్రను ఎంతో ఇష్టపడతానని, ఆ సినిమాతోనే తనకు గుర్తింపు వచ్చిందని తెలిపారు. అలాగే ‘సినిమా చూపిస్తా మామ’లో ఫ్రస్ట్రేటెడ్ పాత్రతోనూ మెప్పించారు. కథాంశంపై పూర్తి అవగాహన ఉంటేనే నటనలో స్పష్టత ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చంటి పుట్టుకతోనే పూర్తి శాఖాహారి. విదేశాలకు వెళ్ళినప్పుడు వెజిటేరియన్ ఆహారం దొరకడం కొంత ఇబ్బందిగా అనిపించినా, ఇప్పటివరకు మాంసాహారం ముట్టలేదని స్పష్టం చేశారు. కెరీర్లో చిన్న విరామం వచ్చిన సమయంలో యూట్యూబ్లో తన గురించి వచ్చిన తప్పుడు వార్తలు, ‘చెత్త థంబ్ నెయిల్స్’ తనను మానసికంగా చాలా కుంగదీశాయని చంటి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని, ఇప్పుడు మళ్ళీ నటనపై దృష్టి పెట్టి ‘పింక్ ఎలిఫెంట్’, ‘బరీ’ వంటి కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని చెప్పారు.
ఇండస్ట్రీలో తాను ఎప్పుడూ అవకాశాల కోసం ఎవరినీ అడగలేదని చంటి తెలిపారు. ఒక దశలో నిరాశ ఎదురైనా, ప్రతి ఒక్కరికీ ఒక సమయం వస్తుందని ఆయన నమ్ముతారు. తన నటనకు ఇచ్చే విలువను ఇతరులతో పోల్చి తగ్గించడం తనకు బాధ కలిగిస్తుందని, తన ఆత్మగౌరవాన్ని వదులుకోనని స్పష్టం చేశారు. తన తర్వాత వచ్చిన సుధీర్ లాంటి నటులు స్టార్లుగా ఎదగడం పట్ల చంటి సంతోషం వ్యక్తం చేశారు. తాను కెరీర్లో చేసిన తప్పులను చేయవద్దని సుధీర్కు వ్యక్తిగతంగా సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో వారు మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆయన కోరుకున్నారు. జీవితం ఒక సైకిల్ లాంటిదని, ఒడిదుడుకులు సహజమని చంటి పేర్కొన్నారు. దైవం ఆడించే ఆట ముందు మన ప్రయత్నాలు చాలా చిన్నవని, ఉన్నంతలో ఆత్మవిశ్వాసంతో ప్రవాహంతో కలిసి ముందుకు సాగడమే జీవితమని తన తత్వాన్ని చాటిచెప్పారు.
ఇది చదవండి: రిలీజ్కు డబ్బుల్లేక మూలాన పడేశారు.. కట్ చేస్తే.. 3 ఏళ్లకు బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్..