Tollywood : అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు.. సీనియర్ హీరోయిన్ కృష్ణ కుమారీ కామెంట్స్ వైరల్..

లెజెండరీ నటి కృష్ణకుమారి గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత అనుభవాల గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరలవుతున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించిన ఆమె, తెలుగు చిత్రాలపైనే ఎక్కువ దృష్టి పెట్టానని తెలిపారు. ప్రముఖ నటి సావిత్రితో తనకు మంచి స్నేహం ఉందని, వారిద్దరి మధ్య పోటీ లేదని కృష్ణకుమారి వివరించారు. సావిత్రి అద్భుతమైన నటి అని, ఆమె పాత్రలు తనకి సరిపోవని, తన పాత్రలు ఆమెకి సరిపోవని అన్నారు.

Tollywood : అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు.. సీనియర్ హీరోయిన్ కృష్ణ కుమారీ కామెంట్స్ వైరల్..
Krishna Kumari - Savitri

Updated on: Jun 05, 2026 | 7:52 AM

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ కృష్ణకుమారి. దశాబ్దాలపాటు సినీ ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చీరకట్టులో పోతపోసిన బొమ్మలా కనిపించిన ఆమె, తన అందం, అమాయకత్వం, అభినయంతో ఆ తరం తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. అగ్ర నటీమణులు ఉన్న రోజుల్లోనూ తనదైన బాణీని సృష్టించుకున్న ఆమె, కొన్ని ప్రత్యేక పాత్రలు సైతం చేశారు. వివాహం తర్వాత నటనకు దూరమైనా, తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె పాటలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయని కృష్ణకుమారి అభిప్రాయపడ్డారు.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ నటించినట్లు కృష్ణకుమారి వెల్లడించారు. హిందీలో ఒక చిత్రం తర్వాత నాలుగు చిత్రాల అవకాశాలు వచ్చినా, విమానం ప్రయాణంపై భయం వల్ల, అలాగే తనకు నచ్చిన భాషలోనే స్వేచ్ఛగా నటించాలనే ఉద్దేశ్యంతో ఆ అవకాశాలను వదులుకున్నానని ఆమె వివరించారు. తమిళంలో నటించినప్పటికీ, ఆ వాతావరణానికి అంతగా దగ్గర కాలేకపోయానని, అందుకే తెలుగు చిత్రాలపైనే ఎక్కువ దృష్టి పెట్టానని తెలిపారు. ప్రముఖ నటి సావిత్రితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ఇద్దరం చాలా స్నేహంగా, అక్కాచెల్లెళ్లలా ఉండేవాళ్లమని కృష్ణకుమారి చెప్పారు. ఒకరి పాత్రలు ఒకరు చేయాలనే పోటీతత్వం లేదని, సావిత్రి అద్భుతమైన నటి అని, ఆమె పాత్రలు ఆమెకి, తన పాత్రలు తనకు సరిపోతాయని అన్నారు. సావిత్రి జీవితం చివరి దశలో విషాదంగా మారడంపై కృష్ణకుమారి తీవ్ర ఆవేదన, కోపం వ్యక్తం చేశారు. అంతటి గొప్ప కళాకారిణి అలా ఎందుకు కావాల్సి వచ్చిందో అర్థం కాలేదని, ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకోవడం ముఖ్యమని ఆమె చెప్పారు.

ఆ రోజుల్లో అందాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి బ్యూటీ ట్రీట్‌మెంట్లు లేవని, బ్యూటీ పార్లర్లకు వెళ్లలేదని ఆమె గుర్తుచేసుకున్నారు. సహనటులతో తన అనుభవాలు పంచుకుంటూ, అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా సరదాగా, సహకారంగా ఉండేవారని, తప్పు చేస్తే సరిచేసేవారని తెలిపారు. ఎన్.టి.రామారావు గారు కొద్దిగా రిజర్వ్‌డ్‌గా ఉన్నా, షాట్ విషయంలో చాలా కచ్చితంగా ఉండేవారని పేర్కొన్నారు. కాంతారావుతో 28 చిత్రాలు, జగ్గయ్యతో కొన్ని చిత్రాలు చేశానని చెప్పారు. దర్శకుడు విఠలాచార్య గారి దర్శకత్వంలో 15 చిత్రాలలో నటించినట్లు తెలిపారు. సినీ పరిశ్రమలో నాటి, నేటి తరం నటీనటుల మధ్య మార్పును వివరిస్తూ, ప్రస్తుత తరం మరింత బహిరంగంగా, స్వేచ్ఛగా ఉన్నారని, తమలా ఇన్నోసెంట్‌గా ఉండరని అన్నారు. సినిమాల్లో చీరకట్టులో నడుము కనిపించకూడదు వంటి ఆంక్షలు తానెప్పుడూ పెట్టలేదని తెలిపారు. అయితే, లక్షాధికారి చిత్రంలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకోమని అడిగినప్పుడు, తాను ధరించనని చెప్పినట్లు వివరించారు. అయితే, ఎన్.టి.రామారావు గారు బాగుంటుందని చెప్పడంతో చిత్రీకరించారని, కానీ సెన్సార్ విభాగం ఆ సన్నివేశాన్ని తొలగించిందని గుర్తుచేసుకున్నారు.

Follow Us