
ఆరోగ్యకరమైన చర్మం సరైన సంరక్షణతోనే సాధ్యమవుతుంది. ఇందుకోసం ఖరీదైన రసాయన ఉత్పత్తుల కంటే ప్రకృతి సిద్ధమైన ఫేస్ ప్యాక్లు వేసుకోవడం అత్యంత ఉత్తమమైన మార్గం. ఇవి చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా ముఖంపై ఉండే మొటిమలు, నల్లటి మచ్చలు, నిస్తేజాన్ని తొలగించి చర్మానికి కొత్త జీవం పోస్తాయి. ముఖ్యంగా ఇంట్లోనే తయారు చేసుకునే డీఐవై (DIY) ప్యాక్లు చర్మంపై సున్నితంగా ఉంటూ అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. శనగపిండి, పసుపుతో తయారయ్యే ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎలా పునరుజ్జీవింపజేస్తుందో తెలుసుకుందాం..
డాక్టర్ మధు చోప్రా ఒక వీడియో ద్వారా ఈ ప్యాక్ తయారీని దశలవారీగా వివరించారు. ఒక గిన్నెలో రెండు చెంచాల శనగపిండి తీసుకోవాలి. చర్మం పొడిబారకుండా ఉండేందుకు ఇందులో ఇంట్లో తయారు చేసిన మీగడ, ఒక చెంచా తాజా పెరుగు కలపాలి. ఆపై చర్మంపై ఇన్ఫెక్షన్లు, మొటిమలు రాకుండా నివారించే పసుపును చేర్చాలి. ఈ మిశ్రమాన్ని చిక్కగా చేయడానికి కొద్దిగా చల్లని పాలు పోసి బాగా కలపాలి. ఈ ప్యాక్ ముఖానికి రాసుకున్న 15 నుండి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే, అలసిపోయిన చర్మం వెంటనే తాజాగా మారుతుంది.
ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు కళ్ల కింద అప్లై చేయకూడదని డాక్టర్ మధు హెచ్చరించారు. కళ్ల కింద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుందని, అక్కడ రుద్దడం లేదా ప్యాక్ వేయడం వంటివి చేయకూడదని సూచించారు. ఇది కేవలం పొడి చర్మం ఉన్నవారికి మాత్రమే కాకుండా, అందరికీ ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఉత్తమ ఫలితాల కోసం ఈ ప్యాక్ను వారానికి ఏడు రోజులు వాడవచ్చని ఆమె సలహా ఇచ్చారు.
ఒకవేళ మీకు శనగపిండి పడకపోతే, దానికి బదులుగా గోధుమ పిండిని వాడుకోవచ్చు. పసుపు అలర్జీ ఉన్నవారు నిమ్మరసం ఉపయోగించవచ్చు. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే డైరీ ఉత్పత్తులు అంటే మీగడ, పాలు పడని వారు టొమాటో గుజ్జు లేదా బంగాళదుంప రసాన్ని కలుపుకోవచ్చు. ఈ సహజ సిద్ధమైన పదార్థాలు చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఖరీదైన బ్యూటీ పార్లర్లకు వెళ్లక్కర్లేకుండా ఇంట్లోనే ఈ చిట్కాతో మెరిసే అందాన్ని సొంతం చేసుకోవచ్చు.