విశాఖపట్టణం:
వైజాగ్లో మరోసారి తారాతోరణం మెరిసింది. పదుల సంఖ్యలో ఉత్తర, ధక్షణాదికి సంభందించిన సినీ ప్రముఖులు సందడి చేశారు. ఇక తమ అభిమాన స్టార్స్ను దగ్గర్నుంచి చూసుకోడానికి అభిమానులు సైతం పోటిపడ్డారు. వెరసి టిఎస్సార్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. 2017, 2018 సంవత్సరాలకు గాను అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులకు అవార్డులను అందించారు.ఈ వేడుకకు విశాఖ పోర్టు స్టేడియం వేదికగా నిలిచింది. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ సెటబ్రిటీస్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్బాబు, రాజేంద్రప్రసాద్ అభిమానులను అలరించారు. ఎందరో పాత, నేటి తరం నటీమణులు కూడా వేదికపై తళుక్కుమన్నారు. ఈ సందర్భంగా సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ కళల్లో ఈశ్వర శక్తి ఉందని, కళాకారులను ప్రోత్సహించడం, ప్రేమించడం ఈశ్వరుని ధ్యానించడమే అన్నారు. అభిమానుల ఆనందమే కళాకారులకు శక్తి అని అన్నారు. వారి ఆనందంకోసం గత పదేళ్లుగా ప్రముఖ సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులను సత్కరిస్తున్నట్టు చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సుబ్బరామి రెడ్డి మొదట్నుంచి కళాబందువని, ఆయన కళాహృదయానికి ఈ కార్యక్రమం నిదర్శనమన్నారు. అవార్డుల ప్రదానోత్సవం కనులపండుగగా జరిగిందని, ఇంత మంది అభిమానుల ఆనందాన్ని గుండెల్లో నింపుకొని ఇంటికి వెళ్తున్నానని అన్నారు. మోహన్బాబు మాట్లాడుతూ ఓటు వద్దు, అభిమానం కావాలన్న మహోన్నత వ్యక్తి సుబ్బరామిరెడ్డి అని కొనియాడారు. దాసరి లేని లోటు తీర్చలేనిదని, దాసరి మెమోరియల్ అవార్డు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.
నాగార్జున మాట్లాడుతూ తనకు నచ్చిన నటులకు, చిత్రాలకు అవార్డులు అందజేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు కొరియోగ్రాఫర్లు, సినీ నటులు చేసిన డాన్స్లు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు ప్రియమణి, కుష్బూ, అలీ, విశాల్, రకుల్ప్రీత్, కేథరిన్, కౌర్, రాశీఖన్నా, విద్యాబాలన్, సుమంత్, బోనీకపూర్, తమన్, ఇళయరాజా,సిరివెన్నెల సీతారామశాస్త్రి, పరుచూరి గోపాలకృష్ణ, దేవిశ్రీప్రసాద్ పాల్గొన్నారు.
అందాల నటి శ్రీదేవిని విశాఖ మరోసారి స్మరించుకుంది. ఆమెపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. టీఎస్సార్–టీవీ–9 జాతీయ సినిమా అవార్డుల ప్రధానం కార్యక్రమంలో శ్రీదేవి మెమోరియల్ అవార్డుకు ప్రముఖ నటి విద్యాబాలన్ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన శ్రీదేవి భర్త బోనీకపూర్ను అవార్డు అందజేసే సమయంలో వేదికపైకి పిలిచారు. అప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మోహన్బాబు, రాజేంద్రప్రసాద్, విద్యాబాలన్ తదితరులు వేదికపైనే ఉన్నారు. శ్రీదేవి నటించిన కొన్ని తెలుగు, హిందీ సినిమాల క్లిప్పింగులను తెరపై ప్రదర్శించారు. వాటిని చూసి బోనీకపూర్ ఎమోషనల్ అయ్యారు.
ఫుల్వామా టెర్రర్ ఎటాక్లోొ ప్రాణాలు కోల్ఫోయిన అమర జవాన్లకు ఫంక్షన్కు హాజరైన ప్రముఖులంతా నివాళి అర్పించారు. మౌనం పాటించి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.