2019 రివైండ్: టాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్‌లు ఇవే

| Edited By:

Dec 24, 2019 | 2:23 PM

గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది టాలీవుడ్‌కు సక్సెస్ రేటు తక్కువనే చెప్పొచ్చు. ముఖ్యంగా టాప్ హీరోలకు ఈ ఏడాది పెద్దగా కలిసి రానప్పటికీ.. చిన్న హీరోలు మాత్రం తమ హవాను చూపించారు. అలాగే చిన్న బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చూపాయి. కాగా గతేడాది మహానటి టాలీవుడ్‌లో బయోపిక్‌లకు తీసేందుకు ఊతమివ్వగా.. ఈ ఏడాది ఏకంగా ఏడు బయోపిక్‌(ఎన్టీఆర్ రెండు భాగాలు కలిసి)లు తెరమీదికి వచ్చాయి. అందులో ఒకటి, రెండు మాత్రమే కమర్షియల్‌గా మంచి […]

2019 రివైండ్: టాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్‌లు ఇవే
Follow us on

గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది టాలీవుడ్‌కు సక్సెస్ రేటు తక్కువనే చెప్పొచ్చు. ముఖ్యంగా టాప్ హీరోలకు ఈ ఏడాది పెద్దగా కలిసి రానప్పటికీ.. చిన్న హీరోలు మాత్రం తమ హవాను చూపించారు. అలాగే చిన్న బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చూపాయి. కాగా గతేడాది మహానటి టాలీవుడ్‌లో బయోపిక్‌లకు తీసేందుకు ఊతమివ్వగా.. ఈ ఏడాది ఏకంగా ఏడు బయోపిక్‌(ఎన్టీఆర్ రెండు భాగాలు కలిసి)లు తెరమీదికి వచ్చాయి. అందులో ఒకటి, రెండు మాత్రమే కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ లిస్ట్‌ ఇప్పుడు చూద్దాం

ఎన్టీఆర్ కథానాయకుడు- మహానాయకుడు:
దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్‌ తెరకెక్కింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ ప్రధానపాత్రలో నటించారు. ఎన్టీఆర్ కథానాయకుడు- మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా ఈ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇందులో ఏ భాగం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోగా.. కమర్షియల్‌గానూ ఈ రెండు మూవీలు బాక్సాఫీస్ వద్ద పరాజయంగా నిలిచాయి.

యాత్ర:
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం యాత్ర. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి విమర్శకులు ప్రశంసలు కురిపించగా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

సైరా నరసింహారెడ్డి:
తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని విడుదల చేశారు. అయితే అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. తెలుగు మినహా మిగిలిన ఏ భాషల్లోనూ ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది.

మల్లేశం:
ఆసు యంత్రం సృష్టికర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మల్లేశం. రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటించాడు. ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ.. కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది.

జార్జిరెడ్డి:
ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పేరు మోసిన విద్యార్థి సంఘాల నేత జార్జి రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జార్జి రెడ్డి. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ.. కమర్షియల్‌గా పెద్ద హిట్‌ను సాధించలేకపోయింది.

రఘుపతి వెంకయ్య నాయుడు:
తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం రఘుపతి వెంకయ్య నాయుడు. సీనియర్ నటుడు నరేష్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రానికి బాబ్జీ దర్శకత్వం వహించాడు. అయితే పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో పాటు సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా పరాజయంగా నిలిచింది.

చూడాలి మరి వచ్చే ఏడాది ఇంకా ఎన్ని బయోపిక్‌లు టాలీవుడ్ తెర మీద సందడి చేయబోనున్నాయో.