హైదరాబాద్: అనుష్క శెట్టి..ఈ హీరోయిన్ గురించి తెలుగు ఆడియెన్స్కి స్ఫెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతోనే కాకుండా ప్రవర్తనతో కూడా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పటి అగ్ర కథానాయిక దివంగత సౌందర్య తర్వాత మళ్లీ అనుష్కలోనే అంత మంచి నేచర్ చూశామని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చెప్పారు కూడా. తాజగా తన మనసు ఎంత స్వచ్చమైనదో స్వీటీ మరోసారి చాటుకుంది. ఏడేళ్ల క్రితం మరణించిన తన అసిస్టెంట్ రవిన వర్థంతి సందర్భంగా..అతన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ ఫోస్ట్ పెట్టింది అనుష్క.
‘నిజంగా మనల్ని ప్రేమించే వారు మనల్ని వదిలి ఎక్కడికీ వెళ్లరు. మరణం అందుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి.. గత 14 ఏళ్లు నాది ఓ ప్రయాణం. మీకు బాగా దగ్గరైన వ్యక్తి ఇక మీ జీవితంలో ఉండరని తెలిసినప్పుడు.. వారు మీ జీవితంలోని కొంత భాగాన్ని తీసుకెళ్తారని అర్థం చేసుకోండి. బ్యూటిఫుల్ రవి కన్నుమూసి ఏడేళ్లు అవుతోందంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. మరణం తర్వాత ఏంటి? అనే విషయం నాకు తెలియదు.. కానీ అతడు నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాడు’ అని అనుష్క పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన అసిస్టెంట్ మరణాన్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకోవడం పట్ల అనుష్క మంచితనాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు.