ముందుంది ముసళ్ల కాలం.. వారం రోజుల్లో బీభత్సం.. ట్రంప్ వార్నింగ్ !
రానున్న కొన్ని రోజుల్లో అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశ ప్రజలను హెచ్చరించారు. అమెరికాలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా..
రానున్న కొన్ని రోజుల్లో అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశ ప్రజలను హెచ్చరించారు. అమెరికాలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. ఎనిమిదివేల మందికి పైగా కరోనా రోగులు మరణించారు. వచ్ఛే వారం రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారవచ్చునని, జన నష్టం విపరీతంగా జరిగే ప్రమాదం ఉందనిట్రంప్ అన్నారు. మనం అతి ఘోరమైన దశలోకి ప్రవేశించబోతున్నాం.. చాలా మంది మృతి చెందవచ్చు.. కానీ మన దేశాన్ని నాశనం కానిచ్ఛే ప్రసక్తే లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. తను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని, సమస్య కన్నా ‘క్యూర్’ అన్నది ముఖ్యమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే కరోనా మహమ్మారి ఇంతగా విలయతాండవం చేయకముందు ఆయన ఈ సమస్యను తేలిగ్గా తీసుకున్న విషయం గమనార్హం. కరోనా అన్నది పెద్ద సమస్యే కాదని, ఒకటి రెండు రోజుల్లో మటుమాయమవుతుందని.. తొలి నాళ్లలో ఆయన ధీమాగా చెప్పారు. కానీ రోజురోజుకీ ఈ వ్యాధి విజృంభిస్తుండడంతో అంతటి పెద్ద మనిషి కూడా బేర్ మంటున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. న్యూయార్క్ సిటీలో కరోనా రోగులకు చికిత్స చేస్తున్న సిబ్బందికి సహాయపడేందుకు వెయ్యి మంది మిలిటరీ సైనికులను నియోగిస్తామని ఆయన తెలిపారు. వీరిలో ఎక్కువగా డాక్టర్లు, నర్సులు కూడా ఉన్నారు.