
మహిళా టెన్నిస్ ప్లేయర్ను స్వయానా తండ్రే గన్తో కాల్చి చంపిన ఘటన హర్యానా రాష్ట్రం గుర్గావ్లో చోటు చేసుకుంది. రాధికా యాదవ్(25) అనే యువతిని, సెక్టార్ 57 లోని తమ ఇంట్లో గన్తో కాల్చి చంపాడు తండ్రి. 5 రౌండ్ల కాల్పులు జరపగా, మూడు బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడిన రాధిక యాదవ్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులునిర్ధారించారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్లో 113వ స్థానంలో కొనసాగుతోంది మృతురాలు రాధికా యాదవ్. రాధిక తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కూతురు సంపాదన మీద బతుకుతున్నావా? అది ఓ బతుకేనా ఇలాంటి సూటిపోటి మాటలు తండ్రిలోని రాక్షసత్వాన్ని నిద్ర లేపాయి. ఏకంగా కూతురు ప్రాణాలు తీసేలా చేశాయి. హర్యానాలోని గురుగ్రామ్లో టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ దారుణ హత్యకు గురైన వార్త సర్వత్రా సంచలనం సృష్టిస్తోంది. తమ నివాసంలోనే ఆమె తండ్రి దీపక్ యాదవ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
రాధికా యాదవ్ రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, కొద్ది కాలం క్రితం జరిగిన టెన్నీస్ పోటీల్లో పాల్గొన్న రాధికా యాదవ్కు తీవ్ర గాయం కావడంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది. కొంతకాలం టెన్నీస్కు దూరం కావడంతో మానసికంగా కృంగి పోయింది. అయితే తనలాగా టెన్నీస్లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు టెన్నీస్ అకాడమనీ ప్రారంభించింది. అనతికాలంలో తన కోచింగ్తో రాధికా యాదవ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తండ్రికి కూడా చేదోడు వాదోడుగా నిలిచింది.
అయితే దీపక్ యాదవ్ కుటుంబానికి పేరు, ప్రతిష్టలు రావడం ఇష్టం లేని ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు. రాధిక టెన్నిస్ అకాడమీ ఆదాయంపై దీపక్ ఆధారపడి జీవిస్తున్నాడని ఎగతాళి చేసేవారట. ఈ అవమానమే అతడి కోపాన్ని పెంచింది. రాధిక తన టెన్నిస్ అకాడమీని మూసివేయాలని తండ్రి కోరాడు. కానీ ఆమె అందుకు నిరాకరించింది. తన కుమార్తె కెరీర్, సంపాదనపై సమాజం నుంచి వస్తున్న విమర్శల కారణంగా కూతురి ప్రాణం తీసినట్లు తండ్రి దీపక్ పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు.