అపెక్స్ కౌన్సిల్ భేటీపై కేసీఆర్ వ్యూహ రచన
తెలుగురాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న జల సంబంధిత అంశాలను ప్రభుత్వాల స్థాయిలో చర్చించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది.
తెలుగురాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న జల సంబంధిత అంశాలను ప్రభుత్వాల స్థాయిలో చర్చించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ తెలంగాణ, ఏపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇద్దరు ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం కావాలని నిర్ణయించింది. కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశాలతో ఇప్పటికే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు రెండు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించాయి. దీంతో కేంద్ర జల్శక్తి అధికారులు అపెక్స్ కౌన్సిల్ భేటీపై దృష్టిసారించారు.
వచ్చే నెల ఆరో తేదీన జరగనున్న అత్యన్నత మండలి(అపెక్స్ కౌన్సిల్) సమావేశం నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రగతి భవన్లో రేపు గురువారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర నీటిపారుదలకు సంబంధించిన సమగ్ర వివరాలు, కేంద్రానికి నివేదించాల్సిన అన్ని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలతో సమావేశానికి హాజరు కావాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నదీజలాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తుందని.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలకు దీటుగా సమాధానం చెప్పాలని సీఎం భావిస్తున్నారు.
నదీ జలాల వినియోగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయాలని కేసీఆర్ అధికారులకు తెలిపారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల అలసత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎండగట్టాలని సూచించారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలని, నిజనిజాలను యావత్ దేశానికి తెలిసేలా వాస్తవాలను రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
దేశంలో రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటివాటా కేటాయింపులు జరగాలని.. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు సీఎం గుర్తు చేశారు. చట్ట ప్రకారం కొత్త ట్రైబ్యునల్ లేదా ప్రస్తుత ట్రైబ్యునల్ ద్వారా అయినా తెలంగాణకి నీటి కేటాయింపులు జరపాలని కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ పరీవాహక ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరినట్లు సీఎం వివరించారు. అయితే, ఏడేళ్లు గడుస్తున్నా ప్రధానికి రాసిన లేఖకు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు. వచ్చే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా నిలదీయాలని.. అదే సమయంలో తెలంగాణకు రావల్సిన నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ఈ సారి జరిగే అపెక్స్ కౌన్సిల్ లో అయినా న్యాయం చేయాల్సిందిగా కోరుతామని సిఎం స్పష్టం చేస్తున్నారు.
అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరయ్యేందుకు అజెండాలతో సిద్ధం కావాలని ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లేఖలు రాశారు. దీంతో ఏపీ, తెలంగాణ రెండూ ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నాయి.