Breaking: విశాఖ ఫ్యాక్టరీలో లీకైన విష వాయువు.. ముగ్గురు మృతి..!
విశాఖపట్టణంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో వాయువు లీకైంది.
విశాఖపట్టణంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో స్టేరైన్ అనే విష వాయువు లీకైంది. 3కి.మీ మేర ఆ వాయువు వ్యాపించింది. దీంతో స్థానికుల్లో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దాదాపు వెయ్యి మంది అస్వస్థతకు గురి కాగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ముగ్గురు మృతి చెందగా.. అందులో ఇద్దరు వృద్దులు, ఒక చిన్నారి ఉన్నారు. ఇక 20 మంది పరిస్థితి విషమంగా ఉండగా.. 80 మందికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. కెమికల్ ఘాటుతో పోలీసులు సైతం అస్వస్థతకు గురయ్యారు.
గ్యాస్ లీక్ కావడంతో భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. సైరన్లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి తరలిస్తున్నారు. అయితే దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని రోజులుగా మూతపడింది. సడలింపుల నేపథ్యంలో ఈ కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు మూడు గంటల సమయంలో పరిశ్రమ నుంచి స్టెరైన్ వాయువు లీకైంది. గంటన్నర తర్వాత అధికారులకు సమాచారం అందింది. మరోవైపు గ్యాస్ లీకైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్ వినయ్చంద్కు ఫోన్ చేసి ఆరా తీశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీపీ ఆర్కే మీనా తెలిపారు.
అయితే నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారని జిల్లా కలెక్టర్ వినయ్చంద్ చెబుతున్నారు. వారికి ఆక్సిజన్ ఇస్తే వెంటనే కోలుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు. బాధితులను ఈ ప్రాంతం నుంచి కొత్త ప్రదేశానికి తీసుకెళ్తే వెంటనే రికవరీ అవుతారని…. మరో రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నామని వినయ్ చంద్ పేర్కొన్నారు.
Read This Story Also: శుభవార్త.. ఇక ఆ రెండు రాష్ట్రాల్లో లిక్కర్ హోం డెలివరీ..!