
హైదరాబాద్, జూన్ 11: రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అర్హులైన విద్యార్థులకు బోధన ఫీజులు, స్కాలర్షిప్లు మంజూరు అయిన తర్వాత వారు మధ్యలో చదువును నిలిపివేస్తే, చెల్లించిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసే అధికారం సంబంధిత సంక్షేమ శాఖలకు కల్పించింది. అలాగే కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరూ పోస్టుమెట్రిక్ బోధన ఫీజులు, ఉపకారవేతనాలు పొందే అర్హత ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు బోధన ఫీజు రీయింబర్స్మెంట్ లేదా ప్రొఫెషనల్ కోర్సులకు ఇచ్చే స్టైపెండ్లో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. కొత్త విధానంలో అక్రమాలకు తావు లేకుండా కొన్ని కఠిన నిబంధనలతో పాటు విద్యార్థులకు అనుకూలమైన సడలింపులు కూడా కల్పించారు.
ఈ కొత్త విధానంతో పారదర్శకత పెరుగుతుందని, అర్హులైన విద్యార్థులకు సమయానికి ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.