
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో (KGBV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 93 విద్యాలయాల్లో ఇంటర్ MPC, BiPC, CEC గ్రూపుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు TGRJC CET-2026 ప్రవేశ పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా కేజీబీవీ (KGBV)ల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్సైట్లో ఏప్రిల్ 15, 2026వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి తెలిపారు. ఇందులో సీటు వచ్చిన విద్యార్ధులకు చదువు, వసతి, భోజనం, పుస్తకాలు, ఏకరూప దుస్తులు అన్నీ ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి విద్యార్థినిపైనా ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. బడిబయట ఉన్న బాలికలు, తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరూ లేని పిల్లలు, 40 శాతం వైకల్యం ఉన్న విద్యార్ధులకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన సీట్లలో జనరల్ 50, ఎస్సీ 15, ఎస్టీ 6, బీసీ 29 శాతం చొప్పున ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర వివరాల కోసం వెబ్సైట్లోని అధికారిక నోటిఫికేషన్ను చెక్ చేసుకోవచ్చు. లేదా 040-24734899, 18004252428 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.