
హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు టీజీపీఎస్సీకి శనివారం (సెప్టెంబర్ 13) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2022లో గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిన ఇప్పటి వరకు నియామక ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటికే ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. మూడేళ్లు గడుస్తున్నా పోస్టింగ్ ప్రక్రియ ఓ కొలిక్కిరాలేదని పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్ష న్యాయవివాదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాని ఫలితాలు వెలువడే వరకు వేచిచూడకుండా గ్రూప్ 2 నియామకాలు పూర్తిచేయాలని టీజీపీఎస్సీకి వినతిపత్రం సమర్పించారు.
నిజానికి ఉద్యోగాల నియామక పత్రాల అందజేత దశలో గ్రూప్ 1తో సహా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు ఆగిపోయి ఉన్నాయి. తాజాగా గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం రద్దు చేసింది. దీంతో డివిజన్ బెంచ్కు వెళ్లేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తుంది. గ్రూప్-1 పరీక్ష ఫలితాలపై వచ్చిన తీర్పుతో గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల నియామకాలపైనా ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తొలుత గ్రూప్-1 పోస్టింగ్లు భర్తీ చేశాకే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ గతంలోనే నిర్ణయించింది. ఆ లెక్కన చూస్తే గ్రూప్ 2 పోస్టింగ్లు ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. అందుకే అభ్యర్ధులు గ్రూప్ 1 పోస్టులకు లింకు పెట్టకుండా తమకు త్వరిత గతిన న్యాయం చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు జాబ్ క్యాలెండర్ కూడా ఆలస్యం కానుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.