
హైదరాబాద్, నవంబర్ 6: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ (సీహెచ్ఎస్ఎల్ 2025) టైర్ 1 ఆన్లైన్ రాత పరీక్ష త్వరలోనే జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్సెస్సీ) విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలతో లాగిన్ అయి పరీక్ష నగనాల సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు. ఇక ఆన్లైన్ రాత పరీక్షలు నవంబర్ 12 నుంచి మొదలు కానున్నాయి.
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 3,131 లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో), డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-ఎ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమీషన్ అభ్యర్థులకు సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో పరీక్ష నగరం, తేదీ, షిఫ్ట్ను ఎంచుకునే సదుపాయాన్ని కల్పిస్తూ సెల్ఫ్ స్లాట్ ఎంపికను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు పరీక్ష కేంద్రం, తేదీ, షిఫ్ట్ను తమకు అనుగుణంగా ఎంచుకోవడానికి అక్టోబర్ 22 నుంచి 28 వరకు అవకాశం కల్పించింది. తాజాగా విడుదల చేసిన సిటీ ఇంటిమేషన్ స్లిప్లలో అభ్యర్థులు ఎంచుకున్న నగరం రాకపోతే నవంబర్ 8 వరకు రిప్రెజెంటేషన్ ఇవ్వొచ్చని కమిషన్ తన ప్రకటనలో వెల్లడించింది.
అలాగే సొంత స్క్రైబ్ సదుపాయం కావాలనుకునే వారు వెబ్సైట్లో కొత్తగా స్క్రైబ్ రిజిస్ట్రేషన్ చేయాలని, దీనితో పాటు ఆధార్ ధ్రువీకరణ కూడా చేయాల్సి ఉంటుందని కమీషన్ స్పష్టం చేసింది. ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.