
దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి సిద్ధమైంది. ‘రోజ్గార్ మేళా’లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi) మే 23న దేశవ్యాప్తంగా కొత్తగా ఎంపికైన 51 వేల మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబడనుంది. ఈ సందర్భంగా ప్రధాని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఉద్యోగాల సృష్టికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ‘రోజ్గార్ మేళా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువతకు వేగంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇప్పుడు నిర్వహించనున్న 19వ రోజ్గార్ మేళా దేశంలోని 47 ప్రాంతాల్లో ఒకేసారి జరగనుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. కొత్తగా నియమితులవుతున్న యువత కేంద్ర ప్రభుత్వంలోని పలు కీలక శాఖల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
వీటిలో రైల్వే మంత్రిత్వ శాఖ, హోంమంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఉన్నత విద్య వంటి శాఖల్లో నియామకాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ రోజ్గార్ మేళా మరో పెద్ద అవకాశంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.