
హైదరాబాద్, మార్చి 30: దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో బాల్వాటికలతోపాటు ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో 3 రోజుల్లో ఆన్లైన్ దరఖాస్తులు ముగియనున్నాయి. అధికారిక ప్రకటన మేరకు ఏప్రిల్ 2, 2026వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కేవీఎస్ సూచించింది. మూడేళ్లకు పైబడి ఆరేళ్లలోపు వయసు కలిగిన బాలబాలికలు బాల్వాటికల్లో ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా, రెండో తరగతి ఆపై తరగతులకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఏప్రిల్ 2, 2026వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
బాలబాలికల వయసు మార్చి 31, 2026 నాటికి బాల్వాటిక 1కు మూడేళ్లు పూర్తయి నాలుగేళ్లు మించకుండా ఉండాలి. బాల్వాటిక 2కు నాలుగేళ్లు పూర్తయి, ఐదేళ్లు మించకూడదు. బాలవాటిక 3లో ప్రవేశాలకు అయిదేళ్లు నిండి ఆరేళ్లు మించకూడదు. ప్రత్యేకావసరాలు కలిగిన వారికి రెండేళ్ల వయోసడలింపు ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.