RGUKT IIIT Admissions 2025: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో 68% సీట్లు అమ్మాయిలకే.. రేపు మూడో విడత కౌన్సెలింగ్‌

నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ.. నాలుగు ట్రిపుల్‌ ఐటీలలో పీయూసీ ప్రవేశాలకు ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ ముగిసింది. రెండు విడతల్లో కలిపి మొత్తం 4,400 సీట్లకుగానూ 4,072 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రవేశాలు పొందిన వారిలో 67.85 శాతం మంది అంటే 2,763 మంది అమ్మాయిలే..

RGUKT IIIT Admissions 2025: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో 68% సీట్లు అమ్మాయిలకే.. రేపు మూడో విడత కౌన్సెలింగ్‌
AP RGUKT IIIT Admissions

Updated on: Jul 22, 2025 | 5:13 PM

అమరావతి, జులై 22: రాష్ట్రంలో ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు గానూ రెండు విడతల కౌన్సెలింగ్‌లు ముగిశాయి. ఈ ఏడాది ట్రిపుల్‌ ఐటీల్లో అత్యధికంగా బాలికలు ప్రవేశాలు పొందారు. నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ.. నాలుగు ట్రిపుల్‌ ఐటీలలో పీయూసీ ప్రవేశాలకు ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ ముగిసింది. రెండు విడతల్లో కలిపి మొత్తం 4,400 సీట్లకుగానూ 4,072 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రవేశాలు పొందిన వారిలో 67.85 శాతం మంది అంటే 2,763 మంది అమ్మాయిలే ఉన్నారు. ఇక అబ్బాయిలు 1,309 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. ట్రిపుల్‌ ఐటీల చరిత్రలో అమ్మాయిలు ఇంత పెద్ద మొత్తంలో ప్రవేశాలు పొందడం ఇదే ప్రథమం అని అధికారులు చెబుతున్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. ఎక్కువ మంది బాలికలు చేరటంతో నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో వసతిగృహాలు కేటాయించటానికి ఓ పరిపాలన భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.

ఇక ట్రిపుల్‌ ఐటీల్లో మిగిలిన సీట్లకు జులై 23న మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ప్రాంగణ నియామకాల్లో విద్యార్ధులు కొలువులు సాధించేందుకు గేట్‌లో శిక్షణ ఇచ్చి ఎంటెక్‌లో సీట్లు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 4 క్యంపస్‌లలో పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి అన్ని రకాల పుస్తకాలను డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంచుతుంది. దీంతో 2025లో ట్రిపుల్‌ ఐటీ కోర్సులు పూర్తి చేసిన వారిలో 70 శాతం మంది కొలువులు దక్కించుకున్నారు.

జులై 23 నుంచి తెలంగాణలో బీఆర్క్‌ ప్రవేశాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీతోపాటు దాని అనుబంధ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) సీట్లలో ప్రవేశాలు జులై 23 నుంచి ప్రారంభంకానుంది. జులై 21న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం రెండు విడతలుగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 22 వరకు తొలి విడత, ఆగస్టు 30 వరకు రెండో విడత కౌన్సెలింగ్‌లు జరుగుతాయి. కన్వీనర్‌ కోటా కింద మొత్తం 508 సీట్లను ఈ ఏడాది భర్తీ చేస్తారు. సెప్టెంబరు 1 నుంచి తరగతులు మొదలవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.