ఏపీ విద్యార్థుల టెన్షన్‌కు ఎండ్ కార్డ్.. జూన్ మూడో వారంలో రెండు కీలక ఫలితాలు

AP Inter Supply 2026 Result Date and Time: లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ, ఈఏపీసెట్ ఫలితాలు జూన్ మూడో వారంలో విడుదలయ్యే అవకాశముంది. ఫలితాల విడుదల కోసం విద్యాశాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇది ముఖ్యమైన సమాచారం. సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన తర్వాతే ఈఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది..

ఏపీ విద్యార్థుల టెన్షన్‌కు ఎండ్ కార్డ్.. జూన్ మూడో వారంలో రెండు కీలక ఫలితాలు
AP Inter Supply Result Date

Updated on: Jun 12, 2026 | 2:44 PM

అమరావతి, జూన్‌ 12: ఆంధ్రప్రదేశ్‌ సప్లిమెంటరీ ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. అందిన సమాచారం మేరకు జూన్‌ 18వ తేదీలోపు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మే 21 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదటిసారిగా ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకునేందుకు బోర్డు అవకాశం కల్పించింది. దీంతో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులతోపాటు సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు కూడా డ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇక ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలు కూడా ఆయా జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో జూన్ 7 నుంచి మొదలవగా జూన్ 11వ తేదీతో ముగిశాయి.

మరోవైపు ఈఏపీసెట్‌ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్ సప్లిమెటరీ ఫలితాలు వెలువడితేగానీ ర్యాంకులు విడుదల చేయడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. అందుకు కారణం ఈఏపీసెట్‌కు ఇంటర్ వెయిటేజీ 20 శాతం ఉండటమే. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ ప్రాథమిక కీ ఇప్పటికే (మే 23న) విడుదలవగా.. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన తర్వాత జూన్‌ 20వ తేదీలోపు ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు కూడా వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా జూన్‌ మూడో వారంలో ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలతోపాటు ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.

నిజానికి జూన్‌ 1న విడుదల కావల్సిన ఈఏపీసెట్‌ ఫలితాల విడుదల ప్రక్రియ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కారణంగా వాయిదా వేశారు. ఈ ఏడాది ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తున్న సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులు దాదాపు1.50లక్షల మంది ఉన్నారు. ఇందులో ఒక్క మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టు వారే లక్ష మంది వరకు రాశారు. దీంతో సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాత ఈఏపీసెట్‌ ర్యాంకులు ప్రకటించనున్నారు.

Follow Us