
భారతీయులందరికీ బంగారం అంటే ఎంతో మక్కువ. ప్రతి పండగలు, శుభకార్యాలు, ఇతర ముఖ్యమైన రోజులలో బంగారు ఆభరణాలు ధరిస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని వెచ్చించి దీనిని కొనుగోలు చేస్తుంటారు. అలాగే చాలామంది తమ పొదుపును బంగారం కొనడానికి వెచ్చిస్తారు. అత్యవసర సమయంలో బంగారాన్ని తాకట్టపెట్టి బ్యాంకుల నుంచి కూడా రుణం తీసుకోవచ్చు.
బంగారం ధరలు రెండు నెలలుగా భారీగా పెరిగిపోతున్నాయి. కొనడానికి ప్రజలు భయపడుతున్నారు. అయితే చైనీస్ సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోలుకు నిలిపివేసింది. దీంతో సప్లయ్ పెరిగి, ధర కూడా తగ్గింది. దేశంలో బంగారం కొనుగోళ్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. బంగారం కొనుగోలును చైనా ఆపేయడంతో పాటు యూఎస్ లో స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా బంగారం ధర తగ్గిపోయింది. దేశంలో కొనుగోళ్లు పెరిగాయి.
చైనా తీసుకున్న నిర్ణయంతో దేశంలోని బంగారు మార్కెట్కు కొత్త కాంతులు వచ్చాయి. చైనీస్ సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లకు విరామం ఇవ్వడంతో బంగారం ధర తగ్గుముఖం పట్టింది. సాధారణంగా ధర తగ్గడంతో దేశంలో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ) ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలుదారుగా అవతరించింది. ఇది 2023-14లో 225 టన్నులను కొనుగోలు చేసింది. అదే సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన దానికంటే ఎక్కువగా కోనుగోలు చేసింది. ఈ విధానాలు బంగారం ధర పెరగడానికి కారణమయ్యాయి.
ఈ ఏడాది ఏప్రిల్లో బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో మేలో పీబీఓసీ కొనుగోలును నిలిపివేసింది. ఫిబ్రవరిలో 3.9 లక్షల ఔన్సులను కొనుగోలు చేసింది. మార్చిలో అది 59 శాతానికి తగ్గి 1.6 లక్షల ఔన్సులకు చేరుకుంది. ధర పెరిగిన నేపథ్యంలో ఏప్రిల్లో 0.6 లక్షల ఔన్సులను మాత్రమే కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇక మేలో పూర్తిగా నిలిపివేసింది. చైనీస్ బ్యాంక్ దాదాపు 18 నెలల పాటు వరసగా బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత మేలో విరామం ప్రకటించింది.
బంగారం ధర పెరుగుదల కారణంగా ఏప్రిల్ లో దేశంలో కొనుగోళ్లు భారీగా తగ్గాయని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. మార్పిడికి సరిపోయే బంగారం ఉన్నవారు మాత్రమే ఆభరణాలను కొనుగోలు చేయడానికి వస్తున్నారన్నారు. చైనీస్ బ్యాంకులు బంగారం కొనుగోలును నిలిపివేయడంతో దానికి డిమాండ్ తగ్గింది. దీంతో 74,222 ఉన్న పది గ్రాముల బంగారం ధర 4.5 శాతం తగ్గింది. ఇప్పుడు రూ 70 వేలకు దగ్గరవుతోంది.
కోల్కతా కు చెందిన సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ సువంకర్ సేన్ మాట్లాడుతూ బంగారం ధర పతనం వల్ల కొనుగోలుదారులను దుకాణానికి రావడానికి ప్రారంభించారన్నారు. అలాగే భవిష్యత్తులో పెరుగుతాయని భావించి ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వివాహాల కోసం ముందుగానే బంగారాన్ని కొనుగోలు చేసి భద్రపర్చుకుంటున్నారని తెలిపారు. గతం వారంలో అమ్మకాలు దాదాపు 15 శాాతం పెరిగాయని వివరించారు. జాయ్లుక్కాస్ సీఈఓ బేబీ జార్జ్ కూడా ఈ విధంగానే వ్యాఖ్యానించారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈవో డేవిడ్ టైట్ ఇటీవల సింగపూర్లో మీడియాతో మాట్లాడుతూ బంగారం ధర మళ్లీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే చైనీస్ బ్యాంక్ తీసుకున్న కొనుగోలు విరామం తాత్కాలికమేనన్నారు. బంగారం ధర తగ్గిన వెంటనే మళ్లీ కొనుగోలు ప్రారంభిస్తుందన్నారు. ఔన్స్ 2200 డాలర్లకు చేరుకున్నప్పుడు చైనీస్ బ్యాంక్ మళ్లీ కొనుగోలు చేయడం ప్రారంభిస్తుందని చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..