
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం సామాన్యులపై ప్రత్యక్షంగా పడుతుంది. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు, డెలివరీ సేవలు, తయారీ ఖర్చులు పెరుగుతాయి. దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడే అవకాశముంటుంది. ఈ పరిణామం ఆర్దిక వ్యవస్థలోని పలు రంగాల్లో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల కేవలం వాహనదారులపై మాత్రమే కాదు.. ఆహారం, సరుకు రవాణా, తయారీ రంగాలపై కూడా పడుతుంది.
డీజిల్ పెరగడం వల్ల ఆహార పదార్ధాల ధరలు పెరుగుతాయి. నీటి పారుదల, ఎరువుల ఉత్పత్తి, కోల్డ్ స్టోరేజ్, ట్రక్కింగ్, రిటైల్ పంపిణీ వరకు ప్రతీ దశలో ఆహార గొలుసు సరఫరా అనేది డీజిల్పై ఆధారపడి ఉంటుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల వ్యాపారులు వినియోగదారులపై భారం మోపుతారు. దీంతో త్వరగా పాడయ్యే వస్తువులైన కూరగాయలు, పండ్లు లాంటి సరుకుల ధరలు త్వరగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధరల సూచీలో ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో డీజిల్ రేట్ల పెరుగుదల మొత్తం ద్రవ్యోల్బణాన్ని వేగంగా ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
ఇక లాజిస్టిక్స్ రంగంపై కూడా డీజిల్ ధరలు ప్రభావితం చూపిస్తాయి. రైడ్ హెయిలింగ్, కొరియర్, డెలివరీ ఫ్లాట్ఫామ్స్, ప్రయాణ ఖర్చులు, చిన్న వ్యాపారుల నిర్వహణ ఖర్చులు లాంటివి పెరగనున్నాయి. ఇక తయారీ రంగం కూడా ప్రభావితం కానుంది. సిమెంట్, ఉక్కు, రసాయనాలు, వినియోగ వస్తువులు లాంటి రంగాల్లో ముడి పదార్థాలు, రవాణా, ప్యాకేజింగ్, పంపిణీకి అయ్యే రవాణా ఖర్చులు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ప్రారంభమైతే క్రమక్రమంగా వీటి ధరలు అన్నీ పెరగడం వల్ల సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపనుంది.