Credit Card: బిగ్ షాక్.. ఫోన్‌పే, పేటీఎం యాప్‌లలో క్రెడిట్ కార్డ్ రెంట్ పేమెంట్స్ బంద్.. కారణం ఏంటంటే..?

మీరు పేటీఎమ్, ఫోన్ పే లేదా క్రెడ్ వంటి యాప్‌లతో క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ప్రతి నెలా మీ అద్దెను చెల్లిస్తున్నారా..? అయితే ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సౌకర్యాన్ని యూపీఐ యాప్స్ నిలిపివేశాయి. ఎందుకు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Credit Card: బిగ్ షాక్.. ఫోన్‌పే, పేటీఎం యాప్‌లలో క్రెడిట్ కార్డ్ రెంట్ పేమెంట్స్ బంద్.. కారణం ఏంటంటే..?
Credit Card Rent Payments Stopped

Updated on: Sep 18, 2025 | 8:21 PM

ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌లైన ఫోన్ పే, పేటీఎమ్, క్రెడ్ వంటివి ఇకపై క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి రెంట్ చెల్లించే సేవను నిలిపివేశాయి. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొత్త నిబంధనల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ మార్పు వల్ల క్రెడిట్ కార్డ్‌ల ద్వారా సులభంగా అద్దె చెల్లించే లక్షలాది మంది అద్దెదారులకు ఇబ్బందులు తప్పవు.
ఆర్బీఐ కొత్త సర్క్యులర్ ప్రకారం.. పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్‌వేలు కేవలం అధికారికంగా నమోదు చేసుకున్న వ్యాపారుల లావాదేవీలను మాత్రమే ప్రాసెస్ చేయాలి. అయితే చాలామంది ఇంటి యజమానులు వ్యాపారులుగా నమోదు చేసుకోలేదు. ఈ కారణంగా ఫిన్‌టెక్ యాప్‌లు వారికి క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపు సేవను అందించలేవు.

అంతేకాకుండా KYC నిబంధనల విషయంలో ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. చాలామంది ఈ అద్దె చెల్లింపులను ఉపయోగించుకుని, డబ్బును దగ్గరి బంధువుల ఖాతాలకు బదిలీ చేసి, ఇతర అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించారు. ఇది పూర్తి స్థాయి ధృవీకరణ ప్రక్రియను తప్పించుకోవడానికి ఉపయోగపడిందని ఆర్‌బీఐ భావించింది.

క్రెడిట్ కార్డ్‌లతో అద్దె  ఎందుకు ట్రెండ్ అయింది?

గత కొన్నేళ్లుగా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లించే పద్ధతి బాగా పాపులర్ అయ్యింది.

దీనికి ముఖ్య కారణాలు:

  • ప్రతి నెలా పెద్ద మొత్తంలో అద్దె చెల్లించడం వల్ల రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ లభించడం.
  • వడ్డీ లేకుండా అద్దె చెల్లింపులకు కొంత కాలం గడువు లభించడం.
  • ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా చెల్లింపులు సులభంగా, అవాంతరాలు లేకుండా ఉండడం.

బ్యాంకులు కూడా పరిమితంగానే ..

ఆర్బీఐ నిబంధనలకు ముందే.. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లింపులపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. ఉదాహరణకు.. హెడ్ఎఫ్‌సీ బ్యాంక్ అద్దె చెల్లింపులపై 1శాతం ఛార్జీని వసూలు చేస్తోంది. ICICI, SBI బ్యాంక్స్ కూడా ఈ చెల్లింపులకు రివార్డ్ పాయింట్లను నిలిపివేశాయి. మార్చి 2024 నుండి చాలా ఫిన్‌టెక్ కంపెనీలు ఈ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, ఆ తర్వాత కొన్నింటిని మళ్లీ ప్రవేశపెట్టాయి. ఇప్పుడు ఆర్బీఐ కొత్త నిబంధనలతో ఈ సేవ పూర్తిగా నిలిచిపోయింది.

ఇకపై ప్రజలు ఏమి చేయాలి?

ఈ కొత్త రూల్స్ పట్టణాల్లో నివసించే లక్షలాది మంది అద్దెదారులకు ఇబ్బందిగా మారాయి. ఇప్పుడు వారు నేరుగా బ్యాంక్ ట్రాన్స్‌ఫ్, యూపీఐ లేదా సాంప్రదాయ పద్ధతుల ద్వారా అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..