
పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఈ సోలార్ ప్యానెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అయితే మీరు ఈ పథకం ద్వారా సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ అనే రెండు రకాల సోలార్ సిస్టమ్లు అందుబాటులో ఉన్నాయి. మీరు తప్పుడు ప్యానెల్ను ఎంచుకుంటే.. రూ.78,000 వరకు అందే ప్రభుత్వ సబ్సిడీని కోల్పోయే ప్రమాదం ఉంది.
ఆన్ గ్రిడ్ అనేది మనం ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెళ్లు ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్కు నేరుగా అనుసంధానం కావడం ద్వారా పనిచేస్తుంది. దీని వల్ల అతిపెద్ద ఆర్థిక ప్రయోజనం ఏమిటంటే.. ఇది ఖరీదైన బ్యాటరీల వాడకాన్ని తొలగిస్తుంది. పగటిపూట సూర్యరశ్మి ప్రకాశవంతంగా ఉన్నప్పుడు ఈ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మీ ఇంటికి వాడుతుంది. ఇంటి అవసరాలకు సరిపోగా.. అధికంగా విద్యుత్తు ఉత్పత్తి అయినప్పుడు.. దానిని ‘నెట్ మీటరింగ్’ విధానం ద్వారా ప్రభుత్వ గ్రిడ్కు పంపించవచ్చు. అలాగే రాత్రిపూట ప్యానెళ్లు విద్యుత్తును ఉత్పత్తి చేయనప్పుడు మీరు గ్రిడ్ నుండి విద్యుత్తును తిరిగి తీసుకోవచ్చు. ప్రభుత్వం మీ అదనపు విద్యుత్తును కొనుగోలు చేస్తుంది. దీని ఫలితంగా మీకు కరెంట్ బిల్లు అనేది ఉండదు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు రూ.78 వేల వరకు సబ్సిడీని పొందవచ్చు.
ఆఫ్ గ్రిడ్ వ్యవస్థకు ప్రభుత్వ విద్యుత్ శాఖ నెట్వర్క్తో ప్రత్యక్ష సంబంధం అనేది ఉండదు. ఈ విధానం భారీ బ్యాటరీలపై ఆధారపడి పనిచేస్తుంది. పగటిపూట ప్యానెళ్లు ఇంటికి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. మిగిలిన విద్యుత్ బ్యాటరీలను ఛార్జ్ చేస్తుంది. రాత్రిపూట ఈ బ్యాటరీలు విద్యుత్ను అందిస్తాయి. బ్యాటరీల ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల గ్రిడ్ ఆధారిత విద్యుత్ కంటే ఆఫ్ గ్రిడ్ ఏర్పాటుకు రెండు నుండి మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రతి నాలుగు నుండి ఐదు సంవత్సరాలకు బ్యాటరీలను మార్చుకునేందుకు అదనంగా ఖర్చు అవుతుంది. దీంతో ఆఫ్ గ్రిడ్ విధానం ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ రాదు. 12 నుండి 15 గంటల పాటు సుదీర్ఘ విద్యుత్ కోతలు సంభవించే మారుమూల, కొండ లేదా గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఆఫ్ గ్రిడ్ వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది