Hybrid Vehicles: పదేళ్లలో పెట్రోల్, డీజిల్ కార్లు తెరమరుగు, కేంద్రమంత్రి మాటలు నిజమవుతాయా..

|

Jun 07, 2024 | 4:57 PM

గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ పెట్రోలు, డీజిల్ వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. అయితే రానున్న కాలంలో మన దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాలు తెరమరుగుకానున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాల అమ్మకాలు లేవు అని ఆయన అన్నారు.

Hybrid Vehicles: పదేళ్లలో పెట్రోల్, డీజిల్ కార్లు తెరమరుగు, కేంద్రమంత్రి మాటలు నిజమవుతాయా..
Petrol
Follow us on

మన దేశంలో సాధారణంగా పెట్రోలు, డీజిల్ తో నడిచే వాహనాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని కొనుగోలు చేయడానికే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ అది పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ పెట్రోలు, డీజిల్ వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. అయితే రానున్న కాలంలో మన దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాలు తెరమరుగుకానున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాల అమ్మకాలు లేవు అని ఆయన అన్నారు.

పెరిగిన ఈవీల వినియోగం..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈవీలకు ప్రజల ఆదరణ పెరిగింది. అయితే ఇవి చార్జింగ్ మౌలిక సదుపాయాలలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీనికి పరిష్కారంగా హైబ్రిడ్ వాహనాలను నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. దేశంలో ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించారు. రాబోయే దశాబ్దంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిలిపివేయడం దాని ఉద్దేశం.

కష్టమే గానీ అసాధ్యం కాదు..

ఇటీవల జరిగిన బహిరంగ ర్యాలీలో గడ్కరీ ఈ విషయాలను ప్రస్తావించారు. వచ్చే పదేళ్లలో డీజిల్, పెట్రోల్ వాహనాలను పూర్తిగా తొలగిస్తామన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను సూచించారు. వాటికి పెరుగుతున్న ఆదరణపై కూడా మాట్లాడారు. రూ.వంద డీజిల్‌ తో ప్రయాణించే దూరాన్ని కేవలం రూ.4 విద్యుత్‌ను ఉపయోగించి వెళ్లవచ్చని సూచించారు. దీనిలో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్ టీ తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్రోల్, డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేసే విషయం కష్టమే గానీ, అసాధ్యం కాదన్నారు.

చార్జింగ్ సమస్యలు..

దేశంలో దాదాపు రెండేళ్లగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగింది. ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కానీ ఈవీ ఛార్జింగ్ కోసం ప్రస్తుత మౌలిక సదుపాయాలు సరిపోవడం లేదు. వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ వాహనాలు మధ్యంతర పరిష్కారాన్ని అందిస్తున్నాయి.

హైబ్రిడ్ కారు అంటే..

హైబ్రిడ్ కారు అంటే సంప్రదాయ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారు ఇంజిన్ కలయిక అని భావించవచ్చు. పెట్రోలు, డీజిల్ ఇంజిన్ కు ఎలక్ట్రిక్ మోటారుకు అమర్చుతారు. కారు ఇంధన సామర్థ్యం మెరుగుపర్చడం దీని ఉద్ధేశం. మామూలు కార్ల కంటే హైబ్రిడ్ వాహనాలు ఎక్కువ శక్తి కలిగి ఉంటాయి. వీటి వల్ల ఇంధన వినియోగం, గ్రీన్ హౌస్ ఉధ్గారాలను తగ్గించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..