
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. గుంటూరు రైల్వే స్టేషన్లో అత్యాధునిక ప్రమాణాలతో స్లీపింగ్ పాడ్స్ సెంటర్ను ప్రారంభించింది. రైలు కోసం వేచి చూసే ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలు, కుటుంబాలకు సురక్షితమైన, సరసమైన వసతి కల్పించడమే లక్ష్యంగా ఈ వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం గుంటూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెం. 1, గేట్ నెం. 3వద్ద ఉంది. ప్రస్తుతం ఇటువంటి సౌకర్యం తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, చర్లపల్లి స్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు గుంటూరు ఆ జాబితాలో చేరింది.
మొత్తం 64 బెడ్ల సామర్థ్యం కలిగిన ఈ కేంద్రంలో ప్రయాణీకుల కోసం అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. 52 సింగిల్ బెడ్లు, 12 డబుల్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. కుటుంబాలు, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 10 డబుల్ బెడ్లు, 12 సింగిల్ బెడ్లను కేటాయించారు. ఉచిత హై-స్పీడ్ వైఫై, వేడి నీటి సరఫరా, లగేజీ భద్రత కోసం లాకర్లు, స్నాక్స్ బార్, ట్రావెల్ డెస్క్, పరిశుభ్రమైన టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి.
సామాన్య ప్రయాణీకుడికి సైతం అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయించారు. సింగిల్ బెడ్ – 3 గంటల వరకు అయితే 150 చెల్లించాలి. అదే 24 గంటల వరకు అయితే 300 చెల్లించాల్సి ఉంటుంది. ఇక డబుల్ బెడ్ రూ.250 నుంచి 500 గా ఉంది. రూమ్స్ 300 నుంచి 1000 వరకు ఛార్జ్ చేస్తారు.
టికెట్ ఆదాయమే కాకుండా నాన్ ఫేర్ రెవెన్యూ పెంచేలా ఈ చొరవ తీసుకున్న గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ సుధేష్ణ సేన్, ఆమె బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రత్యేకంగా అభినందించారు. రైల్వే స్టేషన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చినప్పుడు, హోటళ్లకు వెళ్లి భారీగా ఖర్చు చేయకుండా స్టేషన్ ప్రాంగణంలోనే సురక్షితంగా విశ్రాంతి తీసుకునేందుకు ఈ స్లీపింగ్ పాడ్స్ ఎంతో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి