ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌కు రావడం లేదని ప్రకటించిన Nvidia CEO..! కారణం ఏంటంటే..?

న్యూఢిల్లీలో జరగనున్న ఫ్లాగ్‌షిప్ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు Nvidia CEO జెన్సెన్ హువాంగ్ హాజరు రద్దు చేసుకున్నారు. అనుకోని పరిస్థితుల వల్ల ఆయన రాలేకపోతున్నట్లు Nvidia ధృవీకరించింది. ఇది సమ్మిట్‌కు కొంత నిరాశ కలిగించినప్పటికీ, సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మన్‌తో పాటు ఇతర ప్రపంచ నాయకులు, CEO లు హాజరవుతున్నారు.

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌కు రావడం లేదని ప్రకటించిన Nvidia CEO..! కారణం ఏంటంటే..?
Nvidia Ceo Jensen Huang

Updated on: Feb 14, 2026 | 8:39 PM

వచ్చే వారం న్యూఢిల్లీలో జరిగే ఫ్లాగ్‌షిప్ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు రాలేకపోతున్నట్లు Nvidia CEO జెన్సెన్ హువాంగ్ ప్రకటించారు. 20 మంది దేశాధినేతలు, 100 మందికి పైగా CEO లకు ఆతిథ్యం ఇచ్చే ఈ కార్యక్రమానికి Nvidia CEO అతిధులలో ఒకరు. అయితే ఆయన తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు మెయిల్‌ ద్వారా సమాచారం అందించారు. అనుకోని పరిస్థితుల కారణంగా ఆయన కార్యక్రమానికి హాజరు కాలేరని భారత్‌లోని Nvidia మీడియా సంస్థ ఒక ఇమెయిల్‌లో ధృవీకరించింది.

భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)కు Nvidia సంస్థ విచారం వ్యక్తం చేస్తూ ఒక లేఖ పంపిందని, హువాంగ్‌ గైర్హాజరీని భర్తీ చేయడానికి India AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి బలమైన ప్రతినిధి బృందాన్ని పంపనున్నట్లు సమాచారం. హువాంగ్‌ పర్యటన రద్దు కావడం కాస్త నిరాశపరిచే అంశమే. అనేక మంది ప్రపంచ నేతలు, రాజకీయ నాయకులు, ప్రపంచ, భారతీయ CEO లు, టెక్ నాయకులు, AI, సెమీకండక్టర్లు వంటి రంగాలలోని నిపుణులకు ఆతిథ్యం ఇచ్చే ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌కు ఆయన రాకపోవడం ఎదురుదెబ్బగా భావించవచ్చు.

అయితే హువాంగ్ లేనప్పటికీ ఈ శిఖరాగ్ర సమావేశం ఇప్పటికీ AI రంగాలలోని ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తుంది, వీరిలో ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ అలాగే ఓపెన్‌ ఏఐ నుంచి సామ్ ఆల్ట్‌మన్ కూడా ఉన్నారు. ఈ సమావేశానికి హాజరు కావడానికి Nvidia స్వయంగా ఒక ఉన్నత స్థాయి ప్రతినిధిని పంపే అవకాశం ఉంది. భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వంటి అనేక మంది ప్రపంచ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి