
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, సహజ వాయువు కొరత నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యవసర చర్యలను ప్రారంభించింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరా అంతరాయం కలగడంతో దేశంలో గ్యాస్ లభ్యతతో పాటు ధరలపై కూడా ఒత్తిడి పెరిగిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ పార్లమెంటులో వెల్లడించారు. ఈ పరిణామాలు ముఖ్యంగా వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగే సమయంలో మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
భారతదేశ విద్యుత్ ఉత్పత్తిలో గ్యాస్ ఆధారిత శక్తి వాటా కేవలం 2 శాతమే అయినప్పటికీ, గరిష్ట డిమాండ్ సమయంలో దాదాపు 8 గిగావాట్ల విద్యుత్ను గ్యాస్ ప్లాంట్ల ద్వారా వినియోగిస్తారు. ఈ సమయంలో గ్యాస్ కొరత ఏర్పడితే విద్యుత్ సరఫరా వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడి పడే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పవన విద్యుత్ ప్రాజెక్టులు, బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థల ఆమోదాలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ చర్యలు భవిష్యత్తులో విద్యుత్ కొరతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా 2026 జూన్ నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న బొగ్గు, జలవిద్యుత్ ప్రాజెక్టుల పురోగతిని ప్రభుత్వం సమీక్షిస్తోంది. పెరుగుతున్న వేసవి డిమాండ్ను ఎదుర్కొనేందుకు విద్యుత్ రంగం సిద్ధంగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలో గుజరాత్లోని టాటా పవర్కు చెందిన 4 గిగావాట్ల దిగుమతి బొగ్గు ఆధారిత ప్లాంటును ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు పూర్తి సామర్థ్యంతో నడపాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రస్తుతం దేశ విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు వాటా సుమారు 75 శాతం ఉండటంతో, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే అన్ని ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని, ఎటువంటి మూసివేతలు లేకుండా కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అదేవిధంగా ప్రధాన విద్యుత్ గ్రిడ్పై ఒత్తిడిని తగ్గించేందుకు పరిశ్రమలు తమ సొంత క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రోత్సహిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే, తక్షణ అవసరాలను తీర్చేందుకు బొగ్గుపై ఆధారపడుతున్నప్పటికీ, దీర్ఘకాలికంగా పునరుత్పాదక ఇంధనాల వైపు మార్పును వేగవంతం చేయాలని కేంద్రం స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి