
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ ప్రపంచ ఇంధన సప్లయ్ చైన్పై ప్రభావం చూపుతున్నప్పటికీ, భారతదేశానికి కొంత ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. ఎల్పిజి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయాల మధ్య, హోర్ముజ్ జలసంధిని దాటి రెండు భారీ ఎల్పిజి నౌకలు సురక్షితంగా భారత్ వైపు ప్రయాణిస్తున్నాయి. ఇవి కలిసి దాదాపు 94,000 టన్నుల ఎల్పిజిని దేశానికి అందించనున్నట్లు సమాచారం. ఈ సరఫరాలో భాగంగా BW TYR అనే భారత జెండా కలిగిన నౌక సుమారు 46,500 టన్నుల ఎల్పిజితో ముంబైకి బయలుదేరింది. ఈ సరుకు భారత పెట్రోలియంకు వెళ్తుంది.
ప్రస్తుతం అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న ఈ నౌక సుమారు 13.6 నాట్ల వేగంతో కదులుతూ మార్చి 31 రాత్రి వరకు ముంబై పోర్టుకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2008లో నిర్మితమైన ఈ నౌక భారత జెండా కింద పనిచేస్తూ కీలక సరఫరా బాధ్యతను నిర్వహిస్తోంది. ఇదే సమయంలో BW ELM అనే మరో పెద్ద ఎల్పిజి ట్యాంకర్ సుమారు 47,000 టన్నుల సరుకుతో న్యూ మంగళూరు పోర్టుకు చేరుకోనుంది. ఈ నౌక హిందుస్థాన్ పెట్రోలియం కోసం సరఫరా చేస్తోంది. సుమారు 225 మీటర్ల పొడవు గల ఈ ట్యాంకర్ 14.5 నాట్ల వేగంతో ప్రయాణిస్తూ ఏప్రిల్ 1 నాటికి గమ్యస్థానానికి చేరుతుందని అంచనా.
ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సుమారు 18 భారతీయ నౌకలు ఎల్పిజి, ఎల్ఎన్జి, ముడి చమురు రవాణా నౌకలు ఉన్నాయి. ఈ నౌకల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన భారత్, ఇండియన్ నేవీతో పాటు సంబంధిత సంస్థల సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది. నౌకలు ఇరాన్ తీరానికి సమీపంలో ప్రయాణించే సమయంలో ప్రత్యేక గుర్తింపులతో సంకేతాలు పంపుతూ భద్రతను నిర్ధారిస్తున్నారు. ప్రతి ప్రయాణానికి విడివిడిగా అనుమతులు ఇవ్వడం ద్వారా సురక్షిత రవాణా కొనసాగుతోంది. ప్రపంచ స్థాయిలో ఇంధన సంక్షోభం తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ఈ నౌకల సురక్షిత రాక భారతదేశంలో ఎల్పిజి సరఫరా ఒత్తిడిని తగ్గించడంలో కీలకంగా మారనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి