
మీ బంగారం మేం కొంటాం.. ధర లెక్కగట్టి అక్కడికక్కడే అర నిమిషంలోనే డబ్బులిస్తాం..! అని బండక్షరాలతో పెద్దపెద్ద బోర్డులు కట్టి చేసే ఓల్డ్ గోల్డ్ మార్కెట్ గురించి తెలుసుగా? ఈ ఏడాది అది అమాంతం పెరిగి రెండుమూడింతలకు చేరింది. ముత్తూట్, ఆతిక, మణిపాల్లాంటి బ్రాండెడ్ కంపెనీలైతే గోల్డుకు లోన్లివ్వడం కంటే, పాత బంగారం కొనుగోళ్లమీదే పెద్దగా ఫోకస్ పెట్టేశాయి. దీనికి కారణం, జనం పాత బంగారాన్ని తెగనమ్ముకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడమే. అవును, మనింటి బంగారం గడప దాటిపోతోంది. పసిడి ధరల పతనావస్థకు జడుసుకుని, ఆలసిస్తే ఇంకా దెబ్బైపోతామని బెంబేలెత్తి, బీరువాల్లో బంగారాన్ని బైటికి తీస్తున్నారు. షాపుల వెంట పరుగుపెడుతున్నారు. గత మూడునెలల్లోనే దేశంలో 50 టన్నుల ఓల్డ్ గోల్డ్ అమ్మకాలు జరిగాయ్. డెఫినిట్లీ, పసిడి మార్కెట్ ప్రస్థానంలో ఇదొక రిమార్కబుల్ స్టేజ్. దీని పర్యవసానాలు ఏంటి? ఇదే క్యాలెండర్లో మార్చి 2వ తేదీ సరిగ్గా నాలుగు నెలల కిందట 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర అక్షరాలా లక్షా 69 వేల 349 రూపాయలు. లక్షా డెభ్బై వేలకు జస్ట్ అరంగుళమే దూరం. అప్పటివరకూ అదే ఆల్టైమ్ హై. అన్ని రికార్డుల్నీ బద్దలుకొట్టి, కిలో 3 లక్షల దిశగా పరుగెత్తుతున్న వెండితో పోటీ పడింది...