
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగం వేగంగా విస్తరిస్తోంది. ఇదే జోరు కొనసాగిస్తూ 2030 నాటికి దేశంలో ఈవీ మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశముందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ రంగం ద్వారా అదే సమయానికి(2030) 5 కోట్ల ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. బుధవారం సీఐఐ-ఐటీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ నిర్వహించిన సదస్సులో గడ్కరీ ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో సుమారు 57 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టరై ఉన్నాయని తెలిపారు. మొత్తం వాహన మార్కెట్లో ఈవీల వాటా 7 శాతంగా ఉందని చెప్పారు.
దేశంలో ప్రతి సంవత్సరం సుమారు లక్ష ఎలక్ట్రిక్ బస్సులకు డిమాండ్ ఉందని గడ్కరీ తెలిపారు. అయితే ప్రస్తుతం దేశీయ తయారీదారులు ఏడాదికి 50 వేల నుంచి 60 వేల వరకు మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేయగలుగుతున్నారని చెప్పారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ లక్ష్యం కష్టమైనదే అయినప్పటికీ సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు.
తాను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ.14 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అది సుమారు రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ.78 లక్షల కోట్లు, చైనా విలువ రూ.47 లక్షల కోట్లుగా ఉందని గడ్కరీ వివరించారు.
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం ద్వారా ఆటోమొబైల్ రంగంతో పాటు బ్యాటరీ తయారీ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, సర్వీసింగ్, ఫైనాన్స్ వంటి అనుబంధ రంగాల్లోనూ భారీగా అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు.
భారత్ ప్రస్తుతం ఫాసిల్ ఫ్యూయల్స్ దిగుమతుల కోసం సుమారు రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని గడ్కరీ తెలిపారు. ఇంధన దిగుమతులతో పాటు కాలుష్యం కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో బయోఫ్యూయల్స్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
అదే సమయంలో దేశంలో లాజిస్టిక్స్ ఖర్చును ప్రస్తుత 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎక్స్ప్రెస్వేలు, ఎకనామిక్ కారిడార్ల నిర్మాణంతో లాజిస్టిక్స్ ఖర్చు గతంలో ఉన్న 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పూర్, ఐఐఎం బెంగళూరు నివేదికను ఉటంకిస్తూ గడ్కరీ తెలిపారు.