దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి దిగజారిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి 5 శాతంగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (మొదటి)లో వృద్ధి 8 శాతంగా ఉంది. తయారీ రంగంలో క్షీణత, వ్యవసాయ ఉత్పాదకతలో నిస్తేజం వంటివి జీడీపీ వృద్ధి తగ్గడానికి కారణమైనట్టు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఇంతకు ముందు 2012-13 జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 4.3 శాతంగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి (ఏప్రిల్-జూన్) త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థలో 6.2 శాతం వృద్ధి నమోదైంది. 27 ఏళ్లకాలంలో ఇదే తక్కువ వృద్ధి రేటు. అయినా చైనాకన్నా భారత్ తక్కువ వృద్ధినే సాధించింది.
మరోవైపు, తయారీ రంగంలో గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) వృద్ధి 0.6శాతంగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది 12.1 శాతంగా ఉంది. వ్యవసాయం రంగంలో జీవీఏ 2శాతంగా నమోదు కాగా.. గతేడాది ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో 5.1గా నమోదైంది. నిర్మాణ రంగంలో గత ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో 9.6శాతంగా నమోదైన జీవీఏ 5.7 శాతానికి దిగజారింది. మైనింగ్ రంగంలో మాత్రం వృద్ధిరేటు 0.4 నుంచి 2.7శాతానికి పెరిగింది. జీడీపీ వృద్ధిరేటు తగ్గవచ్చని ఇటీవల ఆర్బీఐ సైతం పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ అంచనాలను ఇటీవల 7శాతం నుంచి 6.9శాతానికి సవరించిన ఆర్బీఐ .. మొదటి అర్ధభాగంలో 5.8 నుంచి 6.6 శాతం మధ్య నమోదు కావొచ్చని పేర్కొంది. ద్వితియార్థంలో 7.3 నుంచి 7.5శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసింది.