
దేశంలో విమాన ప్రయాణాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయంగా భావిస్తున్న 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని ఇచ్చిన తాజా ఉత్తర్వుపై విమానయాన సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల తమ ఆర్థిక స్థితిపై భారీ ప్రభావం పడుతుందని, చివరికి ప్రయాణికులపై భారం పడేలా ఛార్జీలు పెరగవచ్చని హెచ్చరిస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ తరఫున ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పెస్ జెట్ వంటి ప్రముఖ సంస్థలు పౌర విమానయాన కార్యదర్శి సమీర్ సిన్హాకు లేఖ రాశాయి. ఈ ఉత్తర్వు వల్ల విమానయాన సంస్థల ప్రధాన ఆదాయ వనరులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని, కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి పొందేందుకు టికెట్ ధరలను పెంచాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు.
విమానయాన సంస్థల ప్రకారం సీట్ల కేటాయింపు, ధరల నిర్ణయం వంటి అంశాలు పూర్తిగా వాణిజ్య నిర్ణయాలు. ఈ విషయంలో నియంత్రణ సంస్థల జోక్యం పెరగడం పరిశ్రమ స్వతంత్రతను దెబ్బతీస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి అన్బండిల్డ్ సేవల ఛార్జీలను నియంత్రించే అధికారం లేదని, గత కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ ఎఫ్ఐఏ పేర్కొంది.
ప్రారంభంలో ఉచిత సీటు ఎంపిక ప్రయాణికులకు లాభదాయకంగా కనిపించినప్పటికీ, దీని దీర్ఘకాల ప్రభావం ప్రతికూలంగా ఉండవచ్చని సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఛార్జీలు పెరగడం వల్ల ముఖ్యంగా తరచుగా ప్రయాణించే వారు, కుటుంబాలు, బడ్జెట్ ప్రయాణికులు ఎక్కువగా ప్రభావితమవుతారని పేర్కొన్నాయి. ఇంకా అన్ని విమానయాన సంస్థలకు ఒకే విధమైన సీట్ల కేటాయింపు విధానం అమలు చేస్తే, సేవలలో ఉన్న వైవిధ్యం తగ్గిపోతుందని, వినియోగదారులకు ఎంపిక అవకాశాలు తగ్గిపోతాయని వారు తెలిపారు. అలాగే ఈ ఉత్తర్వు జారీ చేసే ముందు తమతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని కూడా విమానయాన సంస్థలు ఆరోపించాయి.
మొత్తంగా ఈ ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను విమానయాన సంస్థలు కోరుతున్నాయి. లేకపోతే, భవిష్యత్తులో ధరల నియంత్రణలో మరింత జోక్యం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి