
అమెరికా – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అలాగే రష్యా – ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు తమ విదేశీ ఆస్తుల భద్రతపై కొత్తగా ఆలోచించడం ప్రారంభించాయి. ముఖ్యంగా బంగారు నిల్వల విషయంలో విదేశాల్లో ఉంచడం సురక్షితమా? అనే ప్రశ్న కేంద్ర బ్యాంకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ సహా అనేక దేశాలు తమ బంగారాన్ని స్వదేశానికి తిరిగి తీసుకువస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశం వద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వల్లో దాదాపు 77 శాతం ప్రస్తుతం దేశీయంగానే నిల్వ ఉంది.
మొత్తం 880.52 టన్నుల బంగారంలో సుమారు 680 టన్నులు భారత్లో ఉండగా, మిగతా భాగం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి విదేశీ సంస్థల వద్ద ఉంది. కేవలం ఆరు నెలల్లోనే 104 టన్నులకుపైగా బంగారాన్ని భారత్కు తిరిగి తీసుకురావడం ఈ మార్పు వేగాన్ని చూపిస్తోంది. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, వ్యూహాత్మక భద్రతా చర్యగా కూడా భావిస్తున్నారు. రష్యాపై పాశ్చాత్య ఆంక్షలు, ఆఫ్ఘనిస్తాన్ విదేశీ ఆస్తుల నిలిపివేత వంటి ఘటనలు, విదేశాల్లో ఉన్న నిధులు రాజకీయ పరిస్థితుల కారణంగా ఎప్పుడైనా నిలిచిపోవచ్చనే భయాన్ని పెంచాయి. అందుకే కేంద్ర బ్యాంకులు తమ బంగారంపై ప్రత్యక్ష నియంత్రణ కలిగి ఉండాలని కోరుకుంటున్నాయి.
గతంలో లండన్ వంటి నగరాల్లో బంగారం నిల్వ చేయడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం. అక్కడి మార్కెట్ల ద్వారా బంగారాన్ని వేగంగా కొనుగోలు చేయడం, అమ్మడం, తాకట్టు పెట్టడం సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారడంతో, లిక్విడిటీ కంటే సార్వభౌమ భద్రతకు దేశాలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే భారత్ పూర్తిగా విదేశీ నిల్వలను ఖాళీ చేయడం లేదు. అంతర్జాతీయ లావాదేవీలు, అత్యవసర ద్రవ్య అవసరాల కోసం కొంత బంగారాన్ని విదేశాల్లోనే కొనసాగిస్తోంది. అయినప్పటికీ అధిక భాగాన్ని దేశీయ ఖజానాల్లో ఉంచడం ద్వారా ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయాలని ఆర్బిఐ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి