
నెలకు రూ.25,000 సంపాదనతో కోటి రూపాయలు సంపాదించడం అసాధ్యం అని మీరు అనుకుంటున్నారా? కానీ అది నిజం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన పొదుపు, తెలివైన పెట్టుబడులతో ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు. దీనికి చేయాల్సిందిల్లా చిన్న పొదుపుతో ప్రారంభించి, దానిని దీర్ఘకాలిక పెట్టుబడిగా మార్చడమే.
మొదటి అడుగు మీ ఖర్చులను నియంత్రించడం. మీ ఆదాయంలో ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత పొదుపు చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు చూసుకోవడం అవసరం. నెలకు రూ. 25,000 జీతం వస్తే.. అందులో 20శాతం నుంచి 30శాతం అంటే రూ.5,000 నుంచి రూ.7,500 వరకు పొదుపు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. మీరు ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే, మీ డబ్బు అంత వేగంగా పెరుగుతుంది.
మీరు పొదుపు చేసిన డబ్బును తెలివిగా పెట్టుబడి పెడితే.. అది కాలక్రమేణా భారీగా పెరుగుతుంది. దీనినే కాంపౌండింగ్ అని అంటారు. ఉదాహరణకు.. మీరు ప్రతి నెలా రూ. 6,000ను ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్లో 12శాతం సగటు వార్షిక రాబడితో పెట్టుబడి పెడితే, కేవలం 24 ఏళ్లలోనే మీ దగ్గర కోటి రూపాయలకు పైగా డబ్బు జమవుతుంది. మీరు చేసే చిన్న చిన్న పొదుపులే పెద్ద సంపదగా మారడానికి కాంపౌండింగ్ సహాయపడుతుంది.
క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడానికి మంచి మార్గాలు. మీకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోతే, ఈక్విటీ మరియు డెట్ ఫండ్స్ కలయికతో కూడిన పెట్టుబడులను ఎంచుకోవచ్చు. మీ పోర్ట్ఫోలియోను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం చాలా అవసరం.
అధిక వడ్డీ ఉండే అప్పులు, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు మీ సంపాదనను హరిస్తాయి. వాటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే కనీసం 6-12 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం కూడా ముఖ్యం. ఇది ఆర్థిక కష్టాల సమయంలో మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా కాపాడుతుంది. సంపదను నిర్మించడం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ. మార్కెట్ ఒడిదుడుకులను పట్టించుకోకుండా, క్రమశిక్షణతో మీ పెట్టుబడులను కొనసాగిస్తే మీరు తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకోగలరు. నెలకు రూ.25,000 జీతంతో కూడా మీరు కోటీశ్వరులు కాగలరని గుర్తుంచుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..