GST Council: జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. రెండేళ్ల డిమాండ్‌కు ఆమోదం

|

Dec 17, 2022 | 7:35 PM

కామర్స్‌పై చిన్న వ్యాపారుల రెండేళ్ల డిమాండ్‌కు ఎట్టకేలకు జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం లభించింది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో చౌక ఉత్పత్తులను పొందడానికి ఇది కొత్త మార్గం..

GST Council: జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. రెండేళ్ల డిమాండ్‌కు ఆమోదం
Gst Council
Follow us on

కామర్స్‌పై చిన్న వ్యాపారుల రెండేళ్ల డిమాండ్‌కు ఎట్టకేలకు జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం లభించింది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో చౌక ఉత్పత్తులను పొందడానికి ఇది కొత్త మార్గంగా చెప్పవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారంజీఎస్టీ కౌన్సిల్ 48వ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. వస్తువులు, సేవా పన్ను (జీఎస్టీ) కి సంబంధించిన విషయాలపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి దీనికి ఛైర్మన్‌గా ఉండగా, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. దేశంలో పెరుగుతున్న ఇ-కామర్స్ ట్రెండ్ దృష్ట్యా, జిఎస్‌టిలో నమోదు కాని వ్యాపారులను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వ్యాపారం చేయడానికి అనుమతించాలని చిన్న వ్యాపారులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్ గత సమావేశంలో దీనికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. శనివారం జరిగిన సమావేశంలో దీనికి తుదిముద్ర పడింది.

ఇందుకోసం జీఎస్టీ చట్టం, నిబంధనలలో అనుకూలమైన సవరణలకు సంబంధించిన నోటిఫికేషన్లను త్వరలో విడుదల చేయనున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ తెలిపింది. అయితే, ఈ మొత్తం వ్యవస్థ వచ్చే ఏడాది అక్టోబర్ 1 నాటికి అమలులోకి రావచ్చు. జిఎస్‌టి కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చిన్న వ్యాపారుల అఖిల భారత సంస్థ సిఎఐటి ప్రశంసించింది. సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం ఈ-కామర్స్ ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించడానికి చిన్న వ్యాపారులకు సాధికారతనిస్తుందని అన్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్‌ను కూడా బలోపేతం చేస్తుందన్నారు.

దేశంలో దాదాపు 8 కోట్ల మంది చిరు వ్యాపారులు ఉన్నారని, అయితే జీఎస్టీ నమోదు లేకుండానే పెద్ద సంఖ్యలో వ్యాపారులు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరి వార్షిక విక్రయాలు జీఎస్టీ పరిమితి కంటే చాలా తక్కువగా ఉండడం ఇందుకు ఒక కారణం. అలాంటి వ్యాపారులు ఇప్పుడు ఇ-కామర్స్‌లో వ్యాపారం చేయగలుగుతారు. ఇది వారికి పెద్ద ఉపశమనంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం భారతదేశం ఇ-కామర్స్ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోని మొత్తం రిటైల్ రంగంలో ఇప్పుడు ఇ-కామర్స్ వ్యాపారం 10% వాటాను కలిగి ఉంది. టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో ఇది 25-50% వరకు వాటాను కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయం ఈ విభాగంలో మరింత పోటీని పెంచుతుంది. ఇది అంతిమంగా వినియోగదారుకు ప్రయోజనం చేకూరుస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి