జీవితంలో రిటైర్మెంట్ అనేది చాలా పెద్ద అంశం. ఒక్కసారిగా జీవితంలో అంతా అయిపోయిందనే భావన చాలా మందిలో కలుగుతుంది. ఆ తర్వాత జీవితం ప్రశాంతంగా ఉండాలని కూడా చాలా మంది భావిస్తారు. అలా కావాలంటే తప్పనిసరిగా డబ్బు అవసరం. పదవీవిరమణ తర్వాత సుఖమయ జీవితం గడపాలంటే అందుకు తగిన నగదు నిల్వలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో సంపాదన శక్తి ఉండదు. కేవలంలో అప్పటికే పొదుపు చేసిన మొత్తం నుంచి వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలా చేయలేని పక్షంలో వేరొకరిపై ఆధారపడాల్సి ఉంటుంది. అలా కాకుండా పదవీవిరమణ సమయంలో ప్రశాంతంగా జీవించడానికి ‘4శాతం నియమం’ చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ 4శాతం నియమం అంటే ఏమిటి? అది పదవీవిరమణ తర్వాత జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..
ప్రముఖ ఆర్థిక నిపుణుడైన బిల్ బెంగెన్ విశ్లేషణల నుంచి ఈ 4శాతం నియమం వచ్చింది. ఈయన 1990లలో 926 నుంచి 1976 వరకు వాస్తవ మార్కెట్ రాబడిని ఉపయోగించి స్టాక్లు, షేర్లు, బాండ్లపై చారిత్రాత్మకంగా గుర్తించబడిన డేటాను విశ్లేషించారు. 1976లో పదవీ విరమణ చేసే వ్యక్తులకు, వారి పోర్ట్ఫోలియో రాబోయే 30 సంవత్సరాల పాటు వారికి ఉపయోగపడుతుందో లేదో ఆయన విశ్లేషించారు. ‘4% నియమం’ అనే పదాన్ని ఈ బెంగెన్ సృష్టించకపోయినా, అది అతను చేసిన పరిశోధన నుంచి వచ్చింది. ఆయన ప్రకారం 4శాతం నియమం ఏమిటంటే ఒక వ్యక్తి పదవీ విరమణ చేసిన తర్వాత మొదటి సంవత్సరంలో పదవీ విరమణ పోర్ట్ఫోలియోలో 4% ఉపసంహరించుకోవాలని ప్రతిపాదిస్తుంది. తరువాతి సంవత్సరాల్లో, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వారి ఉపసంహరణ రేట్లను సర్దుబాటు చేసుకోవాలని సూచిస్తుంది. సింపుల్ చెప్పాలంటే రిటైర్ మెంట్ అయిన తర్వాత వచ్చిన మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చేయకుండా దశల వారీగా మన అవసరాలకు అనుగుణంగా తీసుకోవడం. అంటే వచ్చిన మొత్తంలో మొదటి సారి కేవలం 4శాతం మాత్రమే విత్ డ్రా చేసుకొని మన అవసరాలకు వాడుకోవడం.