
సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం లేదా అస్థిరత నెలకొంటే స్టాక్ మార్కెట్లు పడిపోయి, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య విచిత్రంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈ విరుద్ధమైన పరిస్థితికి గల కారణాలను, భవిష్యత్తులో ధరలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, హెడ్జ్ ఫండ్స్ ఇతర రంగాలలో వచ్చిన నష్టాలను భర్తీ చేయడానికి లేదా తాకట్టు పెట్టిన షేర్ల కోసం అదనపు నగదును చెల్లించడానికి(Margin Calls), అప్పటికే లాభాల్లో ఉన్న గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లను విక్రయిస్తున్నారు. దీనివల్ల మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు తగ్గుతున్నాయి.
అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు(Rate Cuts) విషయంలో సందిగ్ధత నెలకొంది. డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బాండ్ ఈల్డ్స్ ఎక్కువగా ఉండటం వల్ల పెట్టుబడిదారులు రిస్క్ లేని బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్ దృష్టి అంతా క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్పై ఉంది. యుద్ధం కారణంగా వీటి ధరలు భారీగా పెరుగుతుండటంతో, షార్ట్ టర్మ్ ట్రేడర్లు బంగారం నుంచి నిధులను ఎనర్జీ సెక్టార్లోకి మళ్ళిస్తున్నారు.
బంగారం ధరలు మరికొంత కాలం పడిపోయే అవకాశం ఉంది(సుమారు 3 నెలలు). అయితే, లాంగ్ టర్మ్లో బంగారం ఎప్పుడూ మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా, SIP (Systematic Investment Plan) పద్ధతిలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల సగటు ధర(Averaging) తగ్గి, భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, మీ మొత్తం పోర్ట్ఫోలియోలో బంగారానికి 10 శాతం కంటే ఎక్కువ వాటా ఉండకుండా చూసుకోవడం సమానమైన పెట్టుబడి వ్యూహం. యుద్ధ మేఘాలు తొలగి, పరిస్థితులు చక్కబడగానే బంగారం మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.
ఇది చదవండి: బాలకృష్ణతో పేకాట ఆడుతుండగా ఇలా జరిగింది.. ఆ తర్వాత