
గత వారం రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది నెలలుగా తగ్గుతూ వస్తోండగా.. గత వారంలో భారీగా పెరిగాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ గత వారంలో వడ్డీ రేట్లను పెంచడంతో పాటు భారత్తో పాటు రష్యా నుంచి చమురు ఎక్కువగా కొనుగోలు చేసే ఐదు దేశాలపై 100 శాతం దిగుమతి సుంకాలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకతం చేశారు. ముడి చమురు ధరలు పడిపోవడం, డాలర్ బలపడటం వంటి పరిణామాలతో వారం రోజుల్లో పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా అమాంతం పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, ఆర్ధిక అనిశ్చితి ధరల ఎగబాకడానికి కారణమవుతున్నాయి. వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణాలేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
గత వారం సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బంగారం ధరలు పెరిగాయి. సెప్టెంబర్ 13న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,41,700 వద్ద ప్రారంభమవ్వగా.. సెప్టెంబర్ 19 నాటికి రూ.1,42,850కి చేరుకుంది. వారం రోజుల్లో మొత్తం మీద రూ.1150 పెరిగినట్లయింది. 24 క్యారెట్ల విషయానికొస్తే సెప్టెంబర్ 13న రూ.1,54,850 వద్ద కొనసాగగా.. సెప్టెంబర్ 19కు రూ.1,55,840 వద్ద కొనసాగుతోంది. వారంలో రూ.990 పెరిగింది. చెన్నైలో సెప్టెంబర్ 13న 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,41,700గా ఉండగా.. 19వ తేదీ నాటికి రూ.1,42,850కి చేరుకుంది. అటు చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,580 నుంచి రూ.1,55,840కి పెరిగిందని చెప్పవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 13న 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,850 వద్ద ట్రేడవ్వగా.. సెప్టెంబర్ 19వ తేదీనికి రూ.1,43,000కి చేరుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1,54,730 నుంచి రూ.1,55,990కి పెరిగాయి.
వెండి ధరలు కూడా వారం రోజుల్లో పుంజుకున్నాయి. సెప్టెంబర్ 13న హైదరాబాద్లో కేజీ సిల్వర్ రూ.2.50 లక్షల వద్ద ప్రారంభమవ్వగా.. సెప్టెంబర్ 19 నాటికి రూ.2.60 లక్షల వద్ద ట్రేడవుతున్నాయి. వారం రోజుల్లో రూ.10 వేల మేర పెరిగాయి. అయితే ట్రంప్ సుంకాల ప్రభావం, డాలర్ బలపడుతుండటం, క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ దిగొస్తున్న తరుణంలో బంగారం ధరలు ఈ వారంలో ఎలా ఉంటాయనే చర్చ వ్యాపార వర్గాల్లో జరుగుతోంది. ధరలు ఇలాగే పెరుగుతాయా.. లేదా తగ్గుతాయా అనేది ఊహకందని ప్రశ్నగా మారింది. వచ్చే నెల నుంచి దసరా, దీపావళి వంటి పండుగలు వరుసగా వస్తున్నాయి. దీంతో బంగారం ధరలు ఎలా ఉంటాయనేది చూడాలి.