
గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు త్వరలోనే ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాస్తూ.. ఎల్పిజి, పిఎన్జిపై పన్నులను పూర్తిగా తొలగించాలని కోరింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదన ప్రకారం వాణిజ్య ఎల్పిజి సిలిండర్లపై ఉన్న 18 శాతం జీఎస్టిని తొలగిస్తే, ఒక్క సిలిండర్ ధర సుమారు రూ.317 వరకు తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా గృహ వినియోగ సిలిండర్లపై ఉన్న 5 శాతం జీఎస్టిని రద్దు చేస్తే, ఒక్క సిలిండర్పై సుమారు రూ.43 వరకు తగ్గింపు లభించవచ్చు. ఇటీవల ప్రభుత్వం పెంచిన రూ.60 ధరను కూడా ఉపసంహరిస్తే, మొత్తం తగ్గింపు రూ.100 వరకు ఉండే అవకాశముంది.
ప్రస్తుతం దేశీయ ఎల్పిజి సిలిండర్ ధర సుమారు రూ.913గా ఉంది. దీనిపై ఉన్న 5 శాతం జీఎస్టిని తొలగిస్తే, ధర రూ.869 వరకు పడిపోవచ్చు. అదనంగా ధర పెంపును కూడా తగ్గిస్తే, సిలిండర్ ధర రూ.809 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. సీటీఐ వాదన ప్రకారం.. ఇరాన్, అమెరికా యుద్ధం ప్రభావంతో గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ధరలు పెరిగి, వినియోగదారులపై భారం పెరిగింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పన్ను మినహాయింపులు ఇవ్వడం అవసరమని సూచించింది.
ఇంకా ఒక ముఖ్య అంశం ఏమిటంటే, పిఎన్జి ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో లేకపోయినా, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ వల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. కాబట్టి దీనిపైనా పన్ను తగ్గింపు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, గృహ వినియోగదారుల నుంచి వ్యాపార రంగం వరకు అందరికీ గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే, దీనిపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి