
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు పన్ను చెల్లింపుదారులు తమ టీడీఎస్, పన్ను చెల్లింపులు, రీఫండ్ల వివరాలను ధృవీకరించేందుకు ఉపయోగిస్తున్న ఫారం 26AS స్థానంలో కొత్తగా ఫారం 168ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్త ఆదాయపు పన్ను నియమాలు–2026 కింద తీసుకురానున్న ఈ ఫారం ద్వారా పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీలపై మరింత సమగ్ర సమాచారం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫారం 26ASలో ప్రధానంగా పాన్ (PAN) ఆధారంగా మినహాయించిన టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ చెల్లింపులు, అలాగే ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన రీఫండ్ల వివరాలు మాత్రమే కనిపిస్తాయి. అయితే కొత్త ఫారం 168 పరిధి దీనికంటే చాలా విస్తృతంగా ఉండనుంది.
నిపుణుల వివరాల ప్రకారం ఫారం 168లో జీతభత్యాల ఆదాయం, బ్యాంకు వడ్డీ, డివిడెండ్ ఆదాయం, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, షేర్ మార్కెట్ లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు–అమ్మకాలు, విదేశీ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ ఖర్చులు, జీఎస్టీ టర్నోవర్, అధిక విలువ గల ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను రీఫండ్లు, పెండింగ్, పూర్తయిన పన్ను విచారణల వివరాలు కూడా నమోదు కానున్నాయి.
ఫారం 168 రెండు భాగాలుగా ఉండనుంది. పార్ట్–Aలో పన్ను చెల్లింపుదారుడి వ్యక్తిగత వివరాలు, పాన్, మాస్క్ చేసిన ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్, చిరునామా వంటి సమాచారం ఉంటుంది. పార్ట్–Bలో పన్ను చెల్లింపుదారుడికి సంబంధించిన అన్ని పన్ను, ఆర్థిక లావాదేవీలు, సమ్మతి రికార్డులు, డిమాండ్లు, రీఫండ్లు, విచారణల వివరాలు పొందుపరుస్తారు.
పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఫారం 168ను పరిశీలించడం అత్యంత కీలకం. ఆదాయ వివరాలు, టీడీఎస్ క్రెడిట్లు, పెట్టుబడులు, అధిక విలువ గల లావాదేవీలు సరైన విధంగా నమోదు అయ్యాయో లేదో ధృవీకరించుకోవచ్చు. అలాగే పన్ను శాఖ వద్ద ఉన్న సమాచారం, ఐటీఆర్లో ప్రకటించే వివరాల మధ్య వ్యత్యాసాలు లేకుండా చూసుకోవడం ద్వారా నోటీసులు, పరిశీలనలు, పునఃమూల్యాంకన చర్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఫారం 168 అమల్లోకి రావడం ద్వారా పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా మారడమే కాకుండా, పన్ను చెల్లింపుదారులకు ఒకే వేదికపై సమగ్ర ఆర్థిక సమాచారాన్ని అందించే కీలక సాధనంగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి