
లక్షలాది ఉద్యోగులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకున్న కార్మిక మంత్రిత్వ శాఖ, ఇన్యాక్టివ్గా ఉన్న చిన్న EPF ఖాతాల్లోని డబ్బును ఆటోమేటిక్గా తిరిగి చెల్లించేందుకు సిద్ధమైంది. అధికార వర్గాల ప్రకారం EPFOకు అనుసంధానమైన సంవత్సరాలుగా ఉపయోగించని ఖాతాల్లో నిల్వగా ఉన్న చిన్న మొత్తాలను ఖాతాదారులకే నేరుగా జమ చేయడం ఈ చర్య ప్రధాన లక్ష్యం. ఈ నిర్ణయం ప్రకారం ఖాతాలో రూ.1,000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉండి పనిచేయకుండా ఉన్న ఖాతాలకు ఇది వర్తిస్తుంది.
ముఖ్యంగా ఈ మొత్తాన్ని పొందడానికి ఖాతాదారులు ఎటువంటి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కార్యాలయాలకు వెళ్లాల్సిన పని కూడా ఉండదు. EPFO స్వయంగా ఆ మొత్తాన్ని సంబంధిత బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయనుంది. దీనివల్ల చిన్న మొత్తాల కోసం జరిగే ఆలస్యం, కాగితపు ప్రక్రియల భారం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 31 లక్షల EPFO ఖాతాలు పనిచేయనివిగా గుర్తించబడ్డాయి. వీటిలో దాదాపు ఆరు లక్షల ఖాతాల్లో రూ.1,000 లేదా అంతకంటే తక్కువ మొత్తాలు ఉన్నట్లు సమాచారం. ఆధార్కు లింక్ అయిన ఖాతాల్లో డబ్బు బదిలీ త్వరగా జరిగే అవకాశం ఉంది. మిగతా ఖాతాలకు దశలవారీగా చెల్లింపులు చేపట్టనున్నారు.
ప్రస్తుతం ఈ చర్యను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే మిగిలిన సుమారు 25 లక్షల పనిచేయని ఖాతాలకు కూడా ఇదే విధానాన్ని విస్తరించే అవకాశం ఉంది. వరుసగా మూడు సంవత్సరాల పాటు ఎటువంటి లావాదేవీలు లేకపోతే EPF ఖాతా పనిచేయనిదిగా పరిగణిస్తారు. మొత్తంగా ఉపయోగించకుండా ఉన్న పొదుపులను కార్మికులకు వేగంగా అందించడమే లక్ష్యంగా తీసుకున్న ఈ చర్య, EPFO సేవలను మరింత సరళీకృతం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి