వార్‌ ఎఫెక్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ధరల పెంపు! వారిపై అదనపు భారం!

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ చమురు ధరలు పెరిగి, భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఖర్చులు పెరగడంతో విమాన టిక్కెట్ల ధరలు, ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌లు అధికమవుతున్నాయి. ప్రయాణికులపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి విమానయాన సంస్థలతో నిరంతరం చర్చలు జరుపుతోంది.

వార్‌ ఎఫెక్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ధరల పెంపు! వారిపై అదనపు భారం!
Flight Ticket Hike

Updated on: Mar 22, 2026 | 6:30 AM

మధ్యప్రాచ్యంలో ఇరాన్ సంబంధిత ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండటంతో, భారత విమానయాన రంగంపై ప్రభావం కనిపిస్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపిన ప్రకారం.. ఈ ప్రభావం ప్రధానంగా ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరల ద్వారా కనిపించే అవకాశం ఉంది. ప్రతి నెలా మొదటి తేదీన ATF ధరలు సవరించబడుతాయి. అందువల్ల ఏప్రిల్ 1 నుంచి ఈ పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చని మంత్రి పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వం విమానయాన సంస్థలతో నిరంతరంగా చర్చలు జరుపుతోంది.

విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో సుమారు 40 శాతం వరకు ATF ఖర్చే ఉంటుంది. చమురు ధరలు పెరగడం వల్ల ఈ ఖర్చులు అధికమవుతున్నాయి. దీంతో విమాన టిక్కెట్ ధరలు కూడా పెరగడం ప్రారంభమైంది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా, ఇండిగో, ఆకాశ్‌ ఎయిర్‌ వంటి సంస్థలు ఫ్యూయల్ సర్‌ఛార్జీలను అమలు చేస్తున్నాయి. ప్రయాణికులపై భారం తగ్గించేందుకు పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి పలు మంత్రిత్వ శాఖలు కలిసి పని చేస్తున్నాయి. మధ్యప్రాచ్య దేశాలకు విమాన సర్వీసులు సురక్షితంగా కొనసాగడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ATF ధరలను చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. అయితే పెరిగిన ఇంధన ఖర్చులను సమతుల్యం చేసేందుకు విమానయాన సంస్థలు ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌ను విధిస్తాయి. ఇది టిక్కెట్ బేస్ ఫేర్‌కు అదనంగా వసూలు చేయబడుతుంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ ఇంధన మార్కెట్లు అస్థిరంగా మారాయి. దీని ప్రభావం భారతదేశంలో విమాన ప్రయాణ ఖర్చులపై పడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం, విమానయాన సంస్థలు సమన్వయంతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us